పిట్లం, మే 18: రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పిట్లం-చిల్లర్గి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని వారు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ చైర్మన్ మాట్లాడుతూ ..మద్దతు ధర కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం కొనుగోలు సమయాల్లో రైతులకు మొండి చెయ్యి చూపించినప్పటికీ, సీఎం కేసీఆర్ అన్నదాతలు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలపై ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నా రు. వాటిని రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
ప్రభుత్వానికి నష్టం వాటిల్లినప్పటికీ సీఎం కేసీఆర్ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే రైతులు జొన్న సాగు చేస్తున్నారని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారని తెలిపారు. మొన్నటి వరకు జుక్కల్ నియోజకవర్గంలో మక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను సైతం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
గత పాలకుల హయాంలో జుక్కల్ నియోజకవర్గంలో సమస్యలు తీవ్రంగా ఉండేవని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. స్వరాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే హన్మంత్ షిండే పూర్తిగా పరిష్కరించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో రాముడు వంటి హన్మంత్షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, విండో చైర్మన్ శపథంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్, విండో చైర్మన్లు నారాయణరెడ్డి, సాయిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విజయ్, ప్రతాప్రెడ్డి, జొన్న శ్రీనివాస్రెడ్డి, నర్సాగౌడ్, పిట్లం సర్పంచ్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.