నిజామాబాద్ లీగల్, జూలై 20: ట్రాన్స్జెండర్ల అర్హత మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. హైకోర్టు అనుమతితో రాష్ట్రంలోనే తొలిసారిగా అలక అనే ట్రాన్స్జెండర్కు అవుట్ సోర్సింగ్ విధానంలో జిల్లా న్యాయశాఖలో అటెండర్గా అవకాశం కల్పించామన్నారు. నిజామాబాద్ ప్రగతిభవన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్రావుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం సహకారంతో రేషన్, ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మరికొంత మంది ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లకు ఉద్యోగాలు, వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి మార్గాలు చూపిస్తామని తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ..ట్రాన్స్జెండర్లకు ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. వారికి త్వరలోనే రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు రూ. 10 లక్షల నిధిని సమకూరుస్తున్నామన్నారు. జిల్లా జడ్జి కోరిక మేరకు మరో ఇద్దరికి క్లాస్-ఫోర్త్ ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అలకకు జిల్లా యంత్రాం గం సమకూర్చిన ద్విచక్ర వాహనాన్ని అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి(సీనియర్ సివిల్ జడ్జి) విక్రమ్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు.