లక్ష్మాపూర్లో రైతులతో ముచ్చటించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సర్పంచులు, అధికారులకు సూచన
బడాపహాడ్ బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ
చందూర్/వర్ని, జూలై 5 : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని బంగారం లాంటి పంటలను పండించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. పంటలకు నిజాంసాగర్ కెనాల్ ద్వారా సకాలంలో సాగునీటిని అందిస్తామని అన్నారు. చందూర్ మండలం లక్ష్మాపూర్లో స్పీకర్ మంగళవారం పర్యటించి రైతులతో కొంతసేపు ముచ్చటించారు. సాగుపనుల వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచులు, అధికారులతో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏయే గ్రామానికి ఎన్ని నిధులను కేటాయించిందో గుర్తుచేశారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, అధికారులు భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. లక్ష్మాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను సుందరంగా తీర్చిదిద్దడంపై సర్పంచ్ సత్యనారాయణను అభినందించారు. అర్హులు ఇండ్లు కట్టుకునేందుకు మరో విడుతలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కరోనా కారణంగా కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నదని, అర్హులకు త్వరలో కొత్తగా పింఛన్లు అందుతాయని తెలిపారు. మార్గమధ్యంలో మోడల్ స్కూల్ విద్యార్థులు కనిపించడంతో పాఠశాలకు వెళ్లలేదా.. అంటూ పలకరించారు. విద్యార్థి యూనియన్లు పాఠశాలలను బంద్ చేశాయని పిల్లలు సమాధానమివ్వడంతో, వెంటనే ప్రిన్సిపాల్ను పిలిపించి మాట్లాడారు. బంద్లకు మద్దతివ్వడం సరికాదన్నారు. తరగతులను సరిగా నిర్వహించకపోతే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని అన్నారు. అంతకుముందు గ్రామ సర్పం చ్ సత్యనారాయణ వియ్యంకుడు సాయిలు కుటుంబాన్ని పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి సాయిలు చిత్రపటానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఏసీపీ రామారావు, సర్పంచులు బొడ్డోల్ల సత్యనారాయణ, కర్లం సాయారెడ్డి, దేవీసింగ్, లకావత్ రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూడ్ అంబర్ సింగ్, సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి, ప్యారం అశోక్, కోటగిరి రాములు తదితరులు పాల్గొన్నారు.
బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం
వర్ని మండలం బడాపహాడ్లో బస్ట్టాండ్ నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడాపహాడ్ దర్గాను దర్శించుకునేందుకు చాలా రాష్ర్టాల నుంచి భక్తులు వస్తారని, సౌకర్యాలపై దృష్టిసారించాలని అధికారులు, నాయకులకు సూచించారు. ఇందుకోసం తనవంతు సహకారాన్ని అందిస్తానన్నారు. రూ. 10 లక్షల నిధులతో బస్టాండ్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్ సోదరుడి కుమారుడు మృతికి సంతాపం తెలిపారు. బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. జలాల్పూర్ సర్పంచ్ అనితా వెంకాగౌడ్, విండో చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు వీర్రాజు, గిరి, బుజ్జి, శ్రీను పాల్గొన్నారు.