భీమ్గల్, జూలై 1: నిజామాబాబద్ జిల్లా భీమ్గల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఊర పండుగకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కమిటీ ప్రతినిధులు బుధవారం వేల్పూర్లోని ఆయన స్వగృహంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఊర పండుగ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేశారు.
అనంతరం కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ, ఉపాధ్యక్షుడు తీగల రఘు మీడియాతో మాట్లాడుతూ.. జూలై 12న నిర్వహించనున్న ఊర పండుగకు ఎమ్మెల్యే హాజరై గ్రామదేవతల ఆశీస్సులు పొందాలని కోరినట్లు తెలిపారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ, ఉపాధ్యక్షుడు తీగల రఘు, ప్రధాన కార్యదర్శి నిచ్చెమోల్ల రాజేశ్వర్, కోశాధికారి ఎస్.పీ. భూమేశ్వర్, సలహా కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు నీలం రవి, మల్లెల ప్రసాద్, బొదిరె నర్సయ్య, గున్నాల బాలభాగత్, మాజీ కౌన్సిలర్ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.