నస్రుల్లాబాద్, ఏప్రిల్ 21: మండలంలోని బరంగేడ్గి గ్రామంలో ధాన్యం కొనుగోళ్ల నిలిపివేత, రైస్ మిల్లర్లు క్వింటాలుకు ఐదు కిలోల తరుగు తీస్తుండడంపై రైతులు శనివారం ఆందోళన చేసి, తహసీల్దార్ లతకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించారు. ఆదివారం జిల్లా అధికారులు బీర్కూర్ మండల కేంద్రానికి చేరుకొని తరుగు, కొనుగోళ్ల నిలిపివేతపై విచారణ చేపట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఒకవేళ తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీసీఎస్వో మల్లికార్జున్ బాబు, సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ సురేశ్బాబు ఉన్నారు.