Interstate gang | వినాయక నగర్, జనవరి 9 : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏటీఎం లు లూటీ చేయడంతో పాటు వాహనాలు దొంగిలించిన అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ హాల్ లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన అబ్దుల్లా ఖాన్, శామోద్దీన్, మొహమ్మద్ అజీజ్, వాజిద్ ఖాన్ నలుగురు అంతరాష్ట్ర గ్యాంగ్ సభ్యుల తో కలిసి హైదరాబాద్లోని బేగంపేట్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అమీర్ అన్సారి అనే మరో నిందితుడు ముఠా గా ఏర్పడ్డారు.
ఈ ఐదుగురు సభ్యులు కలిసి గత ఏడాది జూలై 8న షాపూర్ నగర్ ప్రాంతంలోని హెచ్డీఎఫ్సీ, ఏటీఎం, సంగారెడ్డి పరిధిలోని పటాన్చెరు ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎంను కొల్లగొట్టి అందులోని రూ.48 లక్షల నగదు దోచుకుపోయినట్లు సీపీ తెలిపారు. అనంతరం జహీరాబాద్ పరిధిలో బొలరో, టోల్ ప్లాజా వద్ద హుందాయ్ కారు, రెండు వాహనాలను దొంగిలించారు. దొంగిలించిన వాహనాలతో వీరు నిజామాబాద్ వచ్చి జిల్లా కేంద్రంలోని కలిలవాడి ప్రాంతంలో గల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను దోచుకునేందుకు యత్నించినట్టు తెలిపారు. అదే సమయంలో నైట్ పెట్రోలింగ్ సిబ్బంది చూసి పోలీస్ టీం లను అప్రమత్తం చేయడంతో వెంబడించినట్లు వెల్లడించారు.
గురువారం ఈ ముఠా సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీ పులాంగ్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా పట్టుకోవడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తాము చేసిన దోపిడీలను అంగీకరించినట్లు సీపీ తెలిపారు. దీంతో ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి దొంగిలించిన రెండు వాహనాలతో పాటు ఆక్సిజన్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, గ్లౌజులు, స్ప్రే తో పాటు ఇనుప రాడ్డు, కటింగ్ ప్లేయర్ ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సీసీఎస్ ఇన్చార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ, ఒకటో టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి, సీసీఎస్ సీఐ సాయినాథ్, వన్ టౌన్ ఎస్ఐ సుమలత తదితరులు పాల్గొన్నారు.