ఖలీల్వాడి/ కామారెడ్డి/నవీపేట, ఫిబ్రవరి 28: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బుధవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 8.15 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించారు. 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 19,177 మంది విద్యార్థులకు 18,322 మంది హాజరుకాగా 795 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో రఘురాజ్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 9,750 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 9,329 మంది హాజరుకాగా, 421మంది గైర్హాజరయ్యారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, సాందీపని కళాశాల సెంటర్ను ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా పలు సెంటర్ల వద్ద నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు నిరాశగా వెనుదిరగడం కనిపించింది. నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా పట్టుకొని డిబార్ చేసినట్లు డిపార్ట్మెంటల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.