కామారెడ్డి, జనవరి 30: జిల్లాలో ఫిబ్రవరి ఒకటి నుంచి 15వ వరకు మూడు దఫాల్లో జరిగే ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖ అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యహ్నం ఒంటి గంట వరకు, 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి అందజేసిన మార్గదర్శకాల మేరకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు.
థియరీ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14 వరకు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు కామారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడలోని 50 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిబంధనల మేరకు ఓఎంఆర్ షీట్ విద్యార్థులకు అందజేస్తూ హాజరు రికార్డు చేయాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్, మానవ తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నాని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, పరీక్షా కేంద్రాల చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇంటర్మీడియేట్ నోడల్ అధికారి షేక్ సలాం, ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు శ్రీనాథ్, నాగేశ్వరయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు.