ఖలీల్వాడి, ఫిబ్రవరి 22: జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యాధికారి, పరీక్షల నిర్వహణ కన్వీనర్ రఘురాజ్ అన్నారు. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కీలకమని పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలుర(ఖిల్లా) జూనియర్ కళాశాలలో సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు పరీక్షల నిర్వహణపై గురువారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఏమరుపాటు లేకుండా చాకచక్యంగా వ్యవహరించాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరీక్షల నిర్వహణ కమిటీని సంప్రదించాలని సూచించారు. పరీక్షలను పక్కాగా నిర్వహించడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మూత్రశాలలు, ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను పోలీస్స్టేషన్ల నుంచి తీసుకవచ్చిన తర్వాత సీసీ కెమెరాల ముందు మాత్రమే ఓపెన్ చేయాలన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు.
ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. 9 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించరాదని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144వ సెక్షన్ విధించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసి వేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, రజీయొద్దీన్ అస్లాం, దేవారాం, బాలుర కళాశాల ప్రిన్సిపాల్ యకీనుద్దీన్, హైపవర్ కమిటీ ప్రతినిధి చిరంజీవి, అధికారి చిన్నయ్య, ప్రభుత్వ అధ్యాపకుల సంఘాల నాయకులు నర్సయ్య, లక్ష్మీనారాయణ, భాస్కర్ పాల్గొన్నారు.