కామారెడ్డి, జనవరి 31: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లాలో 20 ప్రభుత్వ, 11 సోషల్ వెల్ఫేర్, 4 ట్రైబల్ వెల్ఫేర్, 6 మాడల్ స్కూల్, 11 కేజీబీవీ, 6 మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు, తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజీ ఒకటి, 19 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5149 మంది ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు. బ్రిడ్జ్ కోర్సు విద్యార్థులు 1677, వొకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4544, ద్వితీయ సంవత్సరం 3092 మంది విద్యార్థులు ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా 86 కళాశాలలు ఉండగా, మొత్తం 53 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అందులో జనరల్ 50, వొకేషనల్ 3 సెంటర్లు ఉన్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని, అరగంట ముందుగానే విద్యార్థులను ప్రయోగశాలలోనికి పంపిస్తారని అధికారులు తెలిపారు. ప్రాక్టికల్స్ పూర్తయిన తర్వాత పోస్టాఫీసు ద్వారా జవాబుపత్రాలను పంపిస్తారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు డీఐఈవో రఘురాజ్ తెలిపారు. జిల్లాలో 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 15,254మంది ప్రాక్టికల్స్కు హాజరుకానుండగా అందులో 11307 ఎంపీసీ, 3947 బైపీసీ విద్యార్థులు ఉన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని సిద్ధం చేశాం. ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వేసవి దృష్ట్యా తాగునీరు,టాయిలెట్ సౌకర్యాలు కల్పించాం. అన్ని కళాశాలల్లోని విద్యార్థులకు యాజమాన్యాలు హాల్టికెట్లను తప్పకుండా అందజేయాలి.