కామారెడ్డి, మార్చి 3 : ఇంటర్మీడియేట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై శుక్రవారం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయాలని పోలీసు శాఖకు సూచించారు. పరీక్ష జరిగే సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 38 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియేట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొదటి సంవత్సరం 7495 మంది, ద్వితీయ సంవత్సరం 6253 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు.
జిల్లాలో 63 ‘పది’ పరీక్షా కేంద్రాలు
పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తారని డీఈవో రాజు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11,899 మంది విద్యార్థులు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 22 మంది కస్టోడియన్స్, 15 మంది ‘సి’ సెంటర్ కస్టోడియన్స్, 595 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య, పోస్టల్, పోలీసు శాఖలు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పరీక్షల విభాగం అధికారులు నీలం లింగం, అజ్మల్ ఖాన్, నిజాం, అధికారులు పాల్గొన్నారు.