CCTV Camera | బీర్కూర్, మే 5: ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలతోపాటు పోలీసు వ్యవస్థనూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేసింది. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రజల సహకారంతో నేరాలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నది. ఇందుకోసం నూతన టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నది. ఇందులో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పోలీసు అధికారులు ఊరూరా కళాజాత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసుల నిఘాతో సమానమని అనేక ఉదాహరణలతో ప్రజలకు వివరిస్తున్నారు. నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల పాత్రను తెలియజేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, దాతలు, గ్రామాభివృద్ధి కమిటీల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ యజమానులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.
తగ్గుతున్న చోరీలు..
రద్దీగా ఉండే ప్రాంతాల్లో జేబుదొంగలు చేతులకు పనిచెప్పి తమ పని సులువుగా కానిచ్చేస్తుంటారు. కన్నుమూసి తెరిచేలోపు డుబ్బులను మాయం చేసి అక్కడి నుంచి దర్జాగా జారుకుంటారు. తాళం వేసిన నివాసాలను టార్గెట్ చేసి రాత్రిపూట ఇండ్లను గుళ్ల చేస్తారు. ఈ మధ్య ద్విచక్ర వాహనాలను కూడా ఎత్తుకెళ్తున్నారు. కానీ వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఇలాంటి ఘటనలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. చోరీ చేసి నిఘా నేత్రం నుంచి తప్పించుకోలేమనే భయం తో దొంగలు వెనకడుగు వేస్తున్నారు. కెమె రా కండ్లను పట్టించుకోకుండా నేరాలు చేసినవారు వెంటనే దొరికిపోతున్నారు.
వంద మంది పోలీసులతో సమానం..
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. ఎంత మంది పోలీసు లు ఉన్నా కొందరు కండ్లుగప్పి తప్పించునే అవకాశం ఉంటుంది. కానీ సీసీ కెమెరాల
నిఘా నుంచి తప్పించుకోలేరు. ఒక్క కెమెరా వందమంది పోలీసుల నిఘాతో సమానం. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నాం.
-మురళి, సీఐ, బాన్సువాడ రూరల్
సీసీ కెమెరా ఫుటేజీల సాయంతో నిందితుల గుర్తింపు..
అనేక అవాంఛనీయ ఘటనల్లో నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతున్నాయి. కెమెరా ఫుటేజీల సాయంతో పోలీసులు అనేక కేసులను గంటల్లోనే ఛేదిస్తున్నారు. నిందితులకు శిక్ష పడేలా ఆధారాలను సైతం సేకరిస్తున్నారు. బీర్కూర్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో ఏడాది క్రితమే మొత్తం 75 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మండలకేంద్రంలోని శివారులో గత మార్చి 6న వాకింగ్కు వెళ్లిన రోషణ్ అనే యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎస్సై రంజిత్రెడ్డి సీసీ కెమెరాల సహకారంతో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని వెంటనే గుర్తించి కేసును ఛేదించారు. మండల కేంద్రంలోని ఓ దుకాణంలో ప్రతిరోజూ సామగ్రి మాయం కావడంపై ఆందోళన చెందిన యజమాని.. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి దొంగను పట్టుకున్నారు. రూ. లక్షకు పైగా డబ్బులను రికవరీ చేశారు. ప్రతిరోజూ కెమెరా ఫుటేజీలను గమనిస్తుండాలని, కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరించినప్పుడు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.