ఎల్లారెడ్డి రూరల్/ గాంధారి/బాన్సువాడ, ఏప్రిల్ 18: వచ్చే జూన్ 10లోపు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టి మౌలిక సదుపాయలు కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పథకంలో భాగంగా ఎల్లారెడ్డి పట్టణంలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాథమిక, ఎంపీపీఎస్ బాలికల పాఠశాల, జడ్పీహెచ్ఎస్, గాంధారి మండలంలోని పొతంగల్ కలాన్ పాఠశాలతోపాటు బాన్సువాడలోని పోలీస్ లైన్ ప్రాథమికోన్నత, పాత బాన్సువాడలో ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు.
పాఠశాలల్లో తాగునీటి వసతి, టాయిలెట్స్, విద్యుత్ సౌకర్యం, చేపట్టాల్సిన మరమ్మతు పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో కలిసి పరిశీలించి సూచనలు, సలహాలు అందజేశారు. పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సంబంధిత శాఖ ఏఈలకు ఆయన సూచించారు. ఎంఈవోలు వెంకటేశం, సేవ్లానాయక్, నాగేశ్వర్రావు, ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు, ఈఈ మల్లేశం, ఏఈ శ్రీకాంత్ ఉన్నారు.