ఖలీల్వాడి, సెప్టెంబర్ 9 : అస్తవ్యస్తమైన మోదీ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలు.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎదురు చూస్తున్నారని పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. దేశానికి ఆయన నాయకత్వం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అన్ని జల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు శుక్రవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సభలు జరుగుతున్నాయని, మునుగోడు నుంచి నిజామాబాద్ దాకా ప్రజాభిప్రాయం ఒక్కటేనని తెలిపారు. అన్ని సభల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారని గుర్తుచేశారు. దేశంకోసం అనేక పార్టీలు, ప్రధానులు వచ్చారని, వారి పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. దేశంలోని సహజవనరులను సద్వినియోగం చేసుకోవడంలో కేసీఆర్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఎనిమిదేండ్ల మోదీ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరుగలేదన్నారు.
బీజేపీ ముక్త్ భారత్ కావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని 33 జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ నినాదం.. ‘రావాలి కేసీఆర్.. కావాలి కేసీఆర్.. గెలవాలి కేసీఆర్’ అన్నారు. జాతీయ సంపదను మరింత పెంచి పేదలకు పంచాలంటే కేసీఆర్ కావాలని, దేశాన్ని నిలువునా ముంచుతున్న మోదీ పోవాలన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి తెలంగాణ సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ అందాలంటే కేసీఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు. పారిశ్రామిక పెట్టుబడులతోపాటు రైతును రాజు చేయడం ఆయనకే సాధ్యమన్నారు.
కేసీఆర్ వంటి గొప్ప నేతకు సంఖ్యాబలం ముఖ్యం కాదన్నారు. ఆయన సంకల్ప బలం ఉన్న గొప్ప ఉద్యమనేత అన్నారు. కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణ మలిదశ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన సాధ్యమైందని గుర్తుచేశారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్తోనే దేశ పునర్నిర్మాణం జరుగుతుందన్నారు. మోదీది దేశాన్ని ముంచే గుజరాత్ మోడల్ అని, కేసీఆర్ది సంపద పెంచి ప్రజలకు పంచే తెలంగాణ మోడల్ అన్నారు. కేసీఆర్ తెలివితేటలు తెలంగాణకే పరిమితం కాకూడదని, ఆయన సేవలు దేశమంతటా అందాలన్నారు. ప్రజల కల నెరవేరాలంటే ఆయన వెంటనే జాతీయ పార్టీని స్థాపించి హస్తినాపురం దిశగా అడుగులేయాలని కోరారు. బీజేపీ ముక్త్ భారత్ మన ఎజెండా.. దేశమంతా ఎగురాలి గులాబీ జెండా.. అఖండ భారత్కు కేసీఆర్ అండ.. అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్కు సబ్బండవర్ణాల మద్దతు ఉన్నదని, 33 జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, దేశ ప్రజల మనోగతం కూడా ఇదేనన్నారు. అన్ని రంగాల్లో బీజేపీ వైఫల్యం దేశ ప్రజలను కలవర పెడుతున్నదని అన్నారు. మోదీ పాలనపై ఆగ్రహం పెంచుకున్న దేశప్రజలు.. కేసీఆర్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని జీవన్రెడ్డి పేర్కొన్నారు.
పొరుగు రాష్ర్టాల కన్నీళ్లను తుడిచిన కేసీఆర్
టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్
కామారెడ్డి, సెప్టెంబర్ 9 : ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కన్నీళ్లను తుడిచిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అని ఇటీవల జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయని టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ ముజీబుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ఉద్యమంలో పోరాటం చేస్తూ మరణించిన అన్నదాతల కుటుంబాలకు, దేశ రక్షణ కోసం సరిహద్దులో పనిచేస్తూ వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందించిన సహాయాన్ని ఆయా రాష్ర్టాల ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటాయన్నారు. దేశానికి గుజరాత్ మోడల్ వట్టి భ్రమ అని ఆయన తేల్చిచెప్పారు. గుజరాత్ మోడల్ అంటే అదాని, అంబానీలు దోచుకునే మోడల్గా మారిందని ఆయన దుయ్యబట్టారు. జై జవాన్…జై కిసాన్ నినాదాన్ని ఎత్తుకున్న కేసీఆర్ మోడల్ కావాలని ఆయన ఆకాంక్షించారు. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతిరూపంగా..గంగాజమునా తహెజీబ్ మాడల్ అవసరమని దేశ ప్రజలు గుర్తించారని, అందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ముజీబుద్దీన్ విజ్ఞప్తి చేశారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టే సత్తా కేసీఆర్కే ఉందన్నారు.