ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 3: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా..సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. షీ టీం సభ్యులు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ కార్యక్రమాలతోపాటు పలు విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా సదరు ఉపాధ్యాయుడి వ్యవహారం వెలుగుచూసింది. లింగంపేట్ మండలంలోని శట్పల్లి జడ్పీహెచ్ఎస్లో ఈ నెల ఒకటో తేదీన షీ టీం సభ్యులు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ కార్యక్రమాలతోపాటు పలు విషయాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ క్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాస్శర్మ అనే ఉపాధ్యాయుడు కొన్ని నెలలుగా పలువురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు పాఠశాల విద్యార్థినులు తెలిపారు. మంగళవారం ఒక విద్యార్థిని, బుధవారం మరో విద్యార్థిని సదరు ఉపాధ్యాయుడి వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శర్మపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట్ ఎస్సై చైతన్యరెడ్డి తెలిపారు.