ఆర్మూర్, జూలై 3: సమైక్య పాలనలో సర్కారు బడులు అనగానే కూలుతున్న భవనాలు, పెచ్చులూడిన గోడలు, విరిగిపోయిన తలుపులు… ఊడిపోయిన కిటికీలు… కూర్చోవడానికి వీలులేని బెంచీలు.. ఆరుబయటే మూత్రవిసర్జన.. పాలకుల నిర్లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా తయారవ్వగా.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో కార్పొరేట్కు దీటుగా సర్కారు పాఠశాలలు మారాయి. మనఊరు- మనబడి కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలలను మానుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. విద్యార్థులతో సర్కారు పాఠశాలలన్నీ కళకళలాడుతున్నాయి. అందుకు నిదర్శనమే ఆర్మూర్ పరిధిలోని పలు పాఠశాలలు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి, పెర్కిట్ ప్రాథమిక పాఠశాలలు తొలివిడుత మన ఊరు- మనబడి కార్యక్రమానికి ఎంపికయ్యాయి. పనులు పూర్తి కావడంతో పిల్లల సందడి నెలకొన్నది. మామిడిపల్లి ప్రాథమిక పాఠశాలలో 216 మంది విద్యార్థులుండగా, ఇందులో బాలికలు 112, బాలురు 104మంది ఉన్నారు. గతంలో బాత్రూమ్లు సైతం లేక పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలల బాత్రూమ్లనే వాడేవారు. మగ పిల్లలైతే రోడ్డుదాటి వెళ్లి వచ్చేవారు. మనఊరు – మనబడి కార్యక్రమం ద్వారా రూ.17లక్షల 18వేలతో పాఠశాలలో అభివృద్ధి పనుల చేపట్టారు. బాలబాలికలకు వేర్వేరు మూత్రశాలల నిర్మాణంతోపాటు దివ్యాంగులకు సైతం ప్రత్యేక బాత్రూమ్ నిర్మించారు. ప్రతి తరగతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు ట్యూబ్లైట్లతో తరగతి గదుల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
చేతులు శుభ్రం చేసుకోవడానికి, నీరు తాగడానికి వేర్వేరుగా నిర్మాణాలు చేపట్టి మిషన్ భగీరథ ద్వారా స్కూల్ ఆవరణలో సంప్హౌస్ను నిర్మించి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఉత్సాహంగా చేతులు శుభ్రం చేసుకుంటూ, స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు. మధ్యాహ్న భోజనానికి సైతం ప్రత్యేక వంటశాలను నిర్మించారు. రూ.16,300తో బోర్డును ఏర్పాటు చేశారు. ప్రతి తరగతి గదిలో రూ.10వేల విలువజేసే బ్లూబోర్డులను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు సైతం ప్రైవేట్ పాఠశాలలో చదివిన అనుభూతిని పొందుతున్నారు. పెర్కిట్ ప్రాథమిక పాఠశాలలో సుమారు 240 మంది వరకు విద్యార్థులు ఉండగా, అందులో 115బాలురు, 125మంది బాలికలు చదువుతున్నారు. రూ.20లక్షల నిధులతో ఆరు తరగతి గదులకు రంగులు వేయించి ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను ఏర్పాటు చేశారు. వంట గదిని నిర్మించి దాని చుట్టూ మొక్కలతో గార్డెన్ను ఏర్పాటు చేశారు.
గతంతో చూస్తే బాగున్నది..
మా చిన్నతనంలో స్కూల్ ఈ విధంగా ఉండాలని కోరుకునే వాళ్లం. ప్రస్తుతం ఇలాంటి స్కూల్లో పాఠాలు చెబుతున్నందుకు గర్వంగా ఉన్నది. గతంతో బాత్రూమ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మన ఊరు-మన బడిలో వచ్చిన నిధులతో స్కూల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. స్కూల్ రూపురేఖలే మారిపోయాయి. ఇంత మంచి కార్యక్రమం రూపొందించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
-అనసూయ, హెచ్ఎం, మామిడిపల్లి ప్రాథమిక పాఠశాల
బాత్రూమ్కు ఇంటికి వెళ్లేవాళ్లం..
పాఠశాలలో బాత్రూమ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. బాత్రూమ్ వచ్చిందంటే ఇంటికి వెళ్లి వచ్చేవాళ్లం. ప్రస్తుతం పాఠశాలలో బాత్ రూమ్లు నిర్మించడంతో మా సమస్య తీరింది. గతంలో స్కూల్ ఆవరణ అపరిశుభ్రంగా ఉండేది. సరైన వసతులు ఉండేవి కావు. ప్రస్తుతం పాఠశాలను చూస్తుంటే ఇది మా స్కూలేనా అని అనిపిస్తుంది.
– హజార సమీన్, విద్యార్థిని, మామిడిపల్లి