డిచ్పల్లి, ఆగస్టు 5 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు వసతులు కల్పిస్తుండడంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ అడ్మిషన్ల కోసం చేపట్టిన ప్రక్రియ ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’(దోస్త్)లో భాగంగా ప్రభుత్వ కళాశాలల్లో మొదటి విడుతలోనే సీట్లు పెద్ద సంఖ్యలో భర్తీ కావడమే ఇందుకు నిదర్శనం. దోస్త్ ప్రక్రియలో భాగంగా 2023-24 విద్యాసంవత్సరానికి మూడు విడుతల్లో ఇప్పటివరకు చేపట్టిన అడ్మిషన్లలో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పెద్ద సంఖ్యలో మిగిలిపోయాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో మొత్తం 30,830 సీట్లు అందుబాటులో ఉండగా.. మూడు విడుతల్లో కలిపి కేవలం 10,448 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 20,382 సీట్లు ఖాళీగా ఉండడం గమనార్హం.
వివరాలు ఇలా..
వర్పిటీ పరిధిలో 10 ప్రభుత్వ, 1 ఎయిడెడ్, 54 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ (ఎల్) కోర్సుల్లో మొత్తం 30,830 సీట్లు ఉన్నాయి. ఇందులో మొదటి విడుతలో 5,494 సీట్లు కేటాయించగా 3,530 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. రెండో విడుతలో 3,197 సీట్లకు 2,325 మంది, మూడో విడుతలో 5,263 సీట్లకు 4593 మంది కళాశాలల్లో రిపోర్టు చేశారు.
సర్కారు కళాశాలలపై విద్యార్థుల ఆసక్తి ..
ప్రభుత్వ కళాశాలల్లో 6 వేలకు పైగా సీట్లు ఖాళీ ఉండగా.. ఏటా ఎంపిక చేసుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో సీట్లు మొదటి విడుతలోనే దాదాపు భర్తీ అయ్యాయి. అలాగే కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎస్ఈఆర్ఎన్కే బాన్సువాడ, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, భీమ్గల్, బిచ్కుంద, ధర్పల్లి, మోర్తాడ్ ప్రభుత్వ కళాశాలల్లోనూ 75 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్లో కేవలం 25 శాతం మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. వర్సిటీ పరిధిలో 54 ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు ఈసారి నిరాశే మిగిలింది.
కారణం ఏమిటంటే ..
డిగ్రీ అభ్యసించే విద్యార్థుల క్రమంగా తగ్గుతూ వస్తున్నదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇంటర్ తర్వాత అనేక మంది ఇంజినీరింగ్తో పాటు ఇతర చదువుల వైపు వెళ్తున్నారు. దీంతో డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతున్నది. డిగ్రీ పట్టాతో ఉద్యోగాల అవకాశాలు తక్కువనే భావన విద్యార్థుల్లో నెలకొన్నది. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు మండల కేంద్రాల్లోని డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. వీరు జిల్లా కేంద్రాల్లోని కళాశాలల్లో చదివేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పట్టణ కేంద్రాల్లోని విద్యార్థులు ముఖ్యంగా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. దీంతో జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. తద్వారా ప్రతి విద్యా సంవత్సరం యూనివర్సిటీ పరిధిలో సుమారు 65 శాతం సీట్లు మిగిలిపోతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచడంతో విద్యార్థులు ఎక్కువగా సర్కారు కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రైవేటు కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. ఈనెల 7 నుంచి ప్రత్యేక విడుత కార్యక్రమం చేపడున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక విడుతను సద్వినియోగం చేసుకోవాలి
డిగ్రీ కోర్సుల్లో తక్కువ మంది విద్యార్థులు చేరుతుండడంతో ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉన్నది. మూడు విడుతల్లో 10,448 మంది విద్యార్థులు రిపోర్టు చేశారు. ఈనెల 7 నుంచి ప్రత్యేక విడుత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నది. కోరుకున్న కళాశాలలో సీటు రాని వారు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సంపత్కుమార్, దోస్త్ కో-ఆర్డినేటర్