వణికించే చలితో చర్మం పొడిబారడం వంటి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనుకుంటే పొరపాటే. ప్రాణాలను హరించే గుండె సమస్యలు కూడా ఈ చలికాలంలో ముదురుతాయని వైద్యులుహెచ్చరిస్తున్నారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు గుండెపోటు ముప్పు మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి తక్కువగా ఉండడం, చలిగాలులు వీచడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలో ఉష్ణోగ్రతను
ఎదుర్కొనే శక్తి తగ్గిపోయి.. ఆ ప్రభావం నేరుగా ఒంట్లోని అవయవాలపై పడుతుంది. దీంతో గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.
విద్యానగర్, డిసెంబర్ 13: జీవితం ఒక పరుగు పందెం లాంటిది. మారుతున్న కాలం, అవసరాలకు అనుగుణంగా మనిషి తన జీవన గమనాన్ని మార్చుకుంటున్నాడు. ఎన్నో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఆహార నియమాలను మర్చిపోయాడు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో సమయానికి దొరికిన ఆహారాన్ని తింటున్నాడు. ఫాస్ట్ ఫుడ్ తీసుకొని తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది కాక పని ఒత్తిడితో మద్యం, ధూమపానం, పొగాకు తాగడం వంటివి చేస్తుంటారు. ఈ అంశాలు గుండెపోటుకు దారి తీస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
విచ్చలవిడిగా ఫాస్ట్ ఫుడ్ తినడం, పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడంతో అధిక బరువు పెరిగి అనేక రోగాలను తెచ్చుకుంటున్నారు. అధిక బరువే కాకుండా బక్కపలచగా ఉన్నవారికి కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే హార్ట్ ఎటాక్ వస్తుంది. కరోనా వచ్చిన తర్వాత ప్రజలు తమ జీవనవిధానంలో మార్పులు చేసుకుంటున్నారు. సంవత్సరంలో ఒక చలికాలంలోనే హార్ట్ ఎటాక్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య పదికి పైగానే ఉన్నాయి. కరోనా సమయంలో అధిక బరువు ఉన్న ప్రజల మరణాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రజల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే మార్పు కలుగుతున్నది.
గుండెపోటుకు దారితీసే లక్షణాలు..
నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితం. ఉద్యోగ రీ త్యా మానసిక ఒత్తిడి, జంక్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయా మం లేక పోవడం ఇలా అనేక కారణాలతో ప్రతి సంవత్స రం గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జిల్లాలో ఈ ఏడాది 21 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారే ఎక్కువగా మరణించారు. ప్రస్తుతం ప్రతి 10మందిలో ఆరుగురు గుండెపోటుతో చనిపోతున్నారు. మిగిలిన నలుగురు మాత్రమే మృత్యువు నుంచి తప్పించుకుంటున్నారు. షుగర్, బీపీ ఉన్న వారు మరింతగా అప్రమత్తంగా ఉండాలి. రక్తనాళాలు మూసుకోవడంతో వచ్చే వ్యాధే గుండెపోటు. అధికంగా కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్ తినడం, రెస్టారెంట్ ఫుడ్ తినడంతో రక్తనాళాల్లో కొ వ్వు పేరుకుపోతుంది. దీంతో రక్త సరఫరా నిలిచిపోతుంది. గుండెకు ఆక్సిజన్ అందదు. దీంతో గుండెపోటు వస్తుంది.
మనం తీసుకునే ఆహారం..
మనం ప్రతిరోజూ సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో ఎలాంటి రోగాలు రావు అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఎక్కువగా చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు, తరుచూ మాంసం తీసుకుంటే గుండెపోటు వస్తుంది. బరువును పెంచే ఆహారం పదార్థాలు వేయించిన కూరలు, కూల్డ్రింక్స్, బేకరీ ఫుడ్స్ తీసుకోవడంతో కొవ్వు శాతం పెరుగుతుంది. ప్రతిరోజూ గోధుమతోచేసిన ఆహారం, ఓట్స్, చిరుధాన్యాలు, పీచు పదార్థాలు, ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో 40శాతం కన్నా ఎక్కువగా పిండి పదార్థాలు ఉండకూడదు. 30 శాతం ప్రొటీన్, 30శాతం కొవ్వు పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజూ 40 నిమిషాల పాటు వ్యాయామం, మెడిటేషన్, 8గ్లాసుల నీళ్లు తీసుకోవడం వంటివి పాటిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది.
జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి..
జంక్ ఫుడ్, కొలెస్ట్రాల్ పెరిగే ఆహారానికి దూరం ఉండాలి. చలికాలంలో ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. చలికాలంలో ధూమపానం, మాంసం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినకూడద్దు. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. 20 సంవత్సరాలు దాటిన వారు లిపిడ్ ప్రొఫైల్, ట్రైగ్లి సరైడ్స్ చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం బాడీ చెకప్ చేయించుకోవాలి.
-డాక్టర్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్, ఏరియా దవాఖాన, కామారెడ్డి