మాక్లూర్/నందిపేట్, డిసెంబర్ 25:జిల్లా వంజరి సంఘానికి ప్రత్యేకంగా నిర్మిస్తున్న కల్యాణ మండపం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి జనవరి 26న ప్రారంభిస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి వెల్లడించారు. ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా ఎమ్మెల్యే ఆదివారం మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయమే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అడవి మామిడిపల్లి గ్రామం చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామప్రజలు వంజరి సంఘం ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వంజరి సంఘం సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించారు. కాగా అక్కడ నిర్మిస్తున్న వంజరి సంఘం కల్యాణ మండపం పనులను పరిశీలించారు. కల్యాణ మండపానికి సంబంధించిన వివిధ పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే సమీపంలో రెండున్నర ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న వంజరి సంఘం, కల్యాణ మండపం పనులకు ఇప్పటికే రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మిగిలి ఉన్న పనులు పూర్తి చేయడానికి రూ.35లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించిన జీవన్రెడ్డి అందుకు సంబంధించిన ప్రోసీడింగ్ పత్రాలను వంజరి సంఘం ప్రతినిధులకు అందజేశారు. మిగిలి ఉన్న పనులను 13 విభాగాలుగా విభజన చేసి సంఘ సభ్యులకు బాధ్యతలు అప్పగించామన్నారు. కల్యాణ మండపాన్ని జనవరి 15 లోగా వంజరి సంఘానికి అప్పగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జనవరి 26 నుంచి వంజరి సంఘం సోదరులకు ఈ కల్యాణ మండపాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ మల్లారెడ్డి, వంజరి సంఘం ఫంక్షన్ హాల్ నిర్మాణ కమిటీ సభ్యులు భూమన్న, రాజు, రవీంద్ర, నగేశ్, గొట్టుమక్కుల గంగన్న, భూమేశ్, దుమ్మాజీ శ్రీనివాస్, సీహెచ్.కొండూర్ రాజు, సీనియర్ నాయకుడు గోవర్ధన్, భూషణ్ పాల్గొన్నారు.
పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని పద్మశాలీ సంఘ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కల్యాణ మండప నిర్మాణానికి మొదటి విడుతగా రూ.50 లక్షల నిధులు కేటాయిస్తున్నానని, త్వరగా నిర్మించుకోవాలని అన్నారు. మరో విడుత రూ.50 లక్షల నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు బాలగంగాధర్, ప్రతినిధులు రాజశేఖర్, చాట్ల సాగర్, డిష్ గంగాధర్, చెలిమెల విఠల్, భూమేశ్వర్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్ మండలంలోని జూడ చర్చి, సీఎస్ఐ చర్చి, వెల్మల్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, వైస్ ఎంపీపీ దేవేందర్, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, సీనియర్ నాయకులు ఉల్లి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
ఆర్మూర్/మాక్లూర్, డిసెంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని, అధినేత కే.చంద్రశేఖర్ రావు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు ఉండేలా చర్చిల్లో ప్రార్థించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని సీఎస్ఐ చర్చి, నిజామాబాద్ రోడ్డు లోని సీయోన్ చర్చి , జర్నలిస్టు కాలనీలోని హబ్రోక్ చర్చితోపాటు మండలంలోని ఆలూర్, ఖానాపూర్ చర్చిలలో ఎమ్మెల్యే ప్రార్థనలు నిర్వహించారు. మాక్లూర్ మండలం మానిక్భండార్ గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీ మాస్త ప్రభాకర్, పార్టీ మండల అధ్యక్షుడు సత్యం, కార్పొరేటర్ రాయసింగ్ పాల్గొన్నారు.