వేల్పూర్, ఆగస్టు 30: కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవన్నారు. మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన సుమారు వెయ్యిమంది బుధవారం బీఆర్ఎస్లో చేశారు. వారికి మండలకేంద్రంలో మంత్రి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోర్తాడ్ మండలకేంద్రంతోపాటు సుంకెట్, శెట్పల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వేల్పూర్ మండలం పోచంపల్లి, జాన్కంపేట్, అక్లూర్ గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కమ్మర్పల్లి వడ్డెర సంఘం సభ్యులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొందరు డబ్బులిస్తామని ఆశచూపినా అటువైపు చూడడంలేదని, స్వచ్ఛందగా సీఎం కేసీఆర్తోపాటు తనకు మద్దతు తెలిపేందుకు కదిలిరావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు అభివృద్ధి వైపే ఉంటామనడం మంచి మార్పునకు సంకేతమన్నారు. ఎన్నికలు రాగానే కొంతమంది ఊర్లమీద పడి సాధ్యం కానీ హామీలిస్తారని, ఓట్లు వేసుకున్నాక ముఖం చాటేస్తారంటూ.. పసుపు బోర్డు పేరుతో గెలిచిన అర్వింద్ను ఉదహరించారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే రూ. వెయ్యి కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు, రూ. వంద కోట్లతో సీసీ రోడ్లు, రూ. వంద కోట్లతో కుల సంఘ భవనాలు, రూ. 150 కోట్లతో చెక్డ్యాములు నిర్మించామన్నారు. కాంగ్రెస్, బీజేపీ చెప్పే అసత్యాలను నమ్మొద్దని, మోసపోతే గోస తప్పదన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకూ వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ రవి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏలియా, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.