వేల్పూర్ ( నిజామాబాద్ ) : అధికార బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండేందుకు ప్రతిపక్షాలకు చెందిన నాయకులు వారి పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జనరంజక పాలక, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ( Development) కి ఆకర్షితులై నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి వేల్పూర్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్, తనకు మద్దతుగా నిలిచేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎల్లవేళలా అండగా ఉంటానని తడ్పాకల్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.
కామారెడ్డి జిల్లాలో ..
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వందమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సురేందర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు.