డిచ్పల్లి, డిసెంబర్ 29 : మండలంలోని సుద్దపల్లి గ్రామసమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మిట్టాపల్లి ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కుంభ పద్మ (54) మృతిచెందినట్లు డిచ్పల్లి ఎస్సై గణేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం హైదరాబాద్కు వెళ్లిన పద్మ.. కారులో రాత్రి తిరిగి వస్తుండగా. సుద్దపల్లి గ్రామసమీపంలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన కుక్కను డ్రైవింగ్ చేస్తున్న ఆమె కుమారుడు తప్పించబోయాడు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పద్మకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆమెను స్థానికులు అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె కుమారుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఐదు సంవత్సరాలుగా ఆమె మిట్టాపల్లిలోని ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎంగా పని చేస్తున్నారు. మృతురాలి అక్క కుమారుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.