కామారెడ్డి/ ఖలీల్వాడి, జూన్ 30 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు (శనివారం) నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ -2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు కేంద్రాలకు పరీక్షా సమయానికన్నా ముందే చేరుకోవాలని, 15 నిమిషాల ముందు గేట్లను మూసివేస్తారని అధికారులు స్పష్టంచేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో 24 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 39,183 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 125 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 16,101 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం 40 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు..
అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, జ్యువెల్లరీ ఐటమ్స్ తదితర వాటిని కేంద్రాలకు తీసుకురావొద్దని, బూట్లు ధరించవద్దని సూచించారు. హాల్టికెట్పై అభ్యర్థి ఫొటో లేకపోతే పాస్ పోర్ట్సైజ్ ఫొటో అతికించి, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలని, మరో ఫొటోతో పరీక్షా కేంద్రానికి రావాలని అధికారులు సూచించారు. అభ్యర్థి హాల్ టికెట్తోపాటు ఏదైనా అధికార గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేశారు.
పరీక్షాకేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా అన్ని ప్రధాన రూట్లలో అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షకు ముందు, తర్వాత బస్సులు ఆయా రూట్లలో నడుస్తాయని అధికారులు తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం
గ్రూప్-4 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశాం. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేశాం. అభ్యర్థులు నిబంధనలు పాటించి పరీక్షలకు హాజరుకావాలి. సమయానికన్నా ముందే కేంద్రాలకు చేరుకోవాలి.
– జితేశ్ వీ పాటిల్, కామారెడ్డి కలెక్టర్