ధర్పల్లి, నవంబర్ 5 : సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించడమే నిర్విఘ్నంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని ప్రాజెక్టు రామడ్గు గ్రామంలో మంచెల గుట్ట శివాలయం జాతరకు శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి బోనం ఎత్తుకొని శివాలయానికి తరలివెళ్లి బోనాలు సమర్పించారు. అనంతరం గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీలకతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిని ఆదరించి ఆశీర్వదించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
రాబోయే ఎన్నికల్లో మూడోసారి టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని జోష్యం చెప్పారు. దేశ రాజకీయాల్లో సైతం సీఎం కేసీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. దేశ ప్రజలు, రైతులు సైతం బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వినతి మేరకు పలు అభివృద్ధి అంశాలపై సానుకూలంగా స్పందించారు. కేశారం, మైలారం రోడ్డు, మహిళల కోసం షెడ్డు నిర్మాణం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యుడు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి, వైస్ ఎంపీపీ కె.నవీన్రెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సుభాష్, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.