రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సు కోసం నిరంతరం కృషిచేస్తున్నది. పంట పెట్టుబడి సహాయం మొదలు.. సాగునీరు, కరెంటుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పంట చేతికొచ్చిన వెంటనే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దిగుబడులను సైతం సేకరిస్తున్నది. రైతులు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు ఆగం కాకూడదన్న ఉద్దేశంతో రైతు బీమాను ప్రవేశపెట్టింది. 18 నుంచి 59 ఏండ్ల లోపు ఉండి, గుంట భూమి ఉన్న వారందరినీ బీమాకు అర్హులను చేసింది. అన్నదాతకు రూపాయి ఖర్చులేకుండా బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నాలుగు లక్షల మంది రైతులకు బీమా వర్తిస్తున్నది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 9వేల రైతు కుటుంబాలకు మేలు జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 4100 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున దాదాపు రూ.205 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 4540 మంది రైతులు చనిపోగా రూ.5లక్షల చొప్పున ఆయా రైతు కుటుంబాలకు రూ.227 కోట్ల మేర రైతుబీమా డబ్బులు అందించారు.
-నిజామాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరుగాలం శ్రమించే అన్నదాతల జీవితాలకు భరోసా లేదు. పొలం పనుల్లో నిత్యం బిజీగా ఉండే రైతుకు బీమా సౌకర్యం గగనం. పంట ఉత్పత్తిపైనే ఆధారపడి జీవించే కర్షకులకు బీమా సౌకర్యం అన్నది కొద్ది మందికే ఎరుక. అలాంటి జీవిత బీమాను రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల దరికి చేర్చింది. సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనలో భాగంగా తీసుకు వచ్చిన రైతుబీమా పథకం నాలుగున్నరేండ్లుగా విజయవంతంగా అమలవుతున్నది. రైతుకు అకాల మరణం సంభవిస్తే అతడిపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. లబ్ధిదారుని వాటా కింద పైసా తీసుకోకుండా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని నాలుగు లక్షల మంది అన్నదాతలకు రైతుబీమా వర్తిస్తున్నది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు తొమ్మిది వేల రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా డబ్బులు అందాయి. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబానికి నిర్ణీత కాల వ్యవధిలోనే ఎల్ఐసీ ద్వారా బీమా సొమ్ము అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకు బీమా సౌకర్యం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతున్నది.
తొమ్మిది వేల కుటుంబాలకు మేలు..
రైతుబీమా పథకం ద్వారా ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు తొమ్మిది వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. గతంలో అన్నదాత కుటుంబంలో పట్టాదారు చనిపోతే పైసా పరిహారం అందేది కాదు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన వినూత్న పథకంతో ఆ కుటుంబానికి నేడు ఎంతో మేలు జరుగుతున్నది. రైతుబీమాకు పట్టాదారు పాస్బుక్ కలిగిన ప్రతి వ్యక్తిని అర్హుడిగా తేల్చారు. బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ(ఐఆర్డీఏ) నిబంధనల మేరకు బీమా సౌకర్యం పొందే వ్యక్తులు 18 నుంచి 59 ఏండ్లలోపు ఉన్న వారే అర్హులు. నిర్దిష్ట వయస్సు కలిగిన వారికి గుంట భూమి ఉన్నప్పటికీ ఈ పథకం వర్తించేలా రూపొందించారు. పలు కారణాలతో అకాల మరణం చెందుతున్న రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవడమే రైతు బీమా పథకం ప్రధాన ఉద్దేశం. నిజామాబాద్ జిల్లాలో మూడేండ్లలో 4,100 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున ప్రీమియం అందింది. ఇప్పటి వరకు రైతుబీమా ద్వారా మొత్తం రూ.205 కోట్ల చెల్లింపులు జరిగాయి. కామారెడ్డి జిల్లాలో 4,540 మంది రైతులు చనిపోగా రూ.ఐదు లక్షల చొప్పున ఆయా కుటుంబాలకు ఎల్ఐసీ ద్వారా రైతుబీమా అందింది. ఇప్పటి వరకు రూ.227 కోట్లు అందించారు.
రైతన్నకు ఆసరాగా నిలుస్తూ..
వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం ఆసరాగా నిలుస్తున్నది. ప్రారంభంలో ఇందులో చేరడానికి నిరంతరం అవకాశం ఉండేది. 2021 నుంచి వ్యవసాయ శాఖ ఏడాదికోసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నది. 2018, ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన రైతు బీమా ద్వారా సభ్యులుగా నమోదైన రైతు చనిపోతే కుటుంబానికి రూ.ఐదు లక్షల పరిహారం వచ్చేలా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపొందించారు. అర్హులైన రైతు చనిపోతే సంబంధిత వ్యవసాయ శాఖాధికారులు విచారణ చేపట్టి 15రోజుల్లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకరి పేరిట ఏడాదికి ప్రభుత్వం సుమారు రూ.నాలుగు వేలు చెల్లిస్తున్నది. 2018-2019 సంవత్సరంలో రూ.2,270 మాత్రమే ప్రీమియం చెల్లించేది. ఎల్ఐసీ ప్రీమియం ధరల్లో మార్పులు చోటుచేసుకోవడం ద్వారా రెట్టింపు భారం పడినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా రైతుల పేరిట బీమా కడుతున్నది. రైతులకు నయా పైసా భారం లేకుండా రూ.వందల కోట్లను ఎల్ఐసీకి సర్కారే చెల్లిస్తున్నది. రైతుబీమాతో ఉమ్మడి జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులకు లాభం చేకూరుతున్నది.
రైతుకు పెద్ద దిక్కుగా..
రైతుబీమా పథకం ఇప్పటికే చాలా మంది రైతు కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచింది. మూడేండ్లుగా రైతుబీమాకు అర్హుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో 2018-19లో 1.33లక్షల మంది ఉండగా.. కామారెడ్డి జిల్లాలో 1.31లక్షల మంది ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య ఉభయ జిల్లాల్లో కలిపి దాదాపుగా నాలుగు లక్షల మందికి చేరింది. వచ్చే ఏడాది రెన్యువల్ చేయబోయే రైతుబీమాలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఏడాది కాలంలో భూముల క్రయవిక్రయాలతో పట్టాదారులు చాలా మంది కొత్తగా చేరుతున్నారు. 2023 ఆగస్టులో ప్రారంభమయ్యే రైతుబీమాకు వీరు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు వారికి బీమా వర్తిస్తుంది. గుంట సాగు భూమి ఉన్న రైతుకు కూడా లాభం చేకూరేలా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)కు రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పేరిట పాలసీ కట్టి వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. రైతుకు ఉచితంగా బీమా కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఔదార్యాన్ని కర్షకులు అభినందిస్తున్నారు.
బీమా డబ్బులతో బిడ్డ పెండ్లి జేసిన..
నవీపేట: నా భర్త ఎర్రోళ్ల గంగాధర్ పేరిట 38 గుంటల భూమి ఉన్నది. నా భర్త అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. రైతుబీమా పథకం కింద నాకు ఇటీవల రూ.ఐదు లక్షలు వచ్చాయి. ఆ డబ్బులతో అప్పు లేకుండా రెండో కూతురు పెండ్లి ఘనంగా చేసిన. సీఎం కేసీఆర్ సల్లంగా ఉండలా.
– ఎర్రోళ్ల పుష్ప, రాంపూర్
పొలం అమ్మి కూతురు పెండ్లి అప్పు తీర్చే దాన్ని..
నవీపేట, మే 14: రైతుబీమా ఫథకం ద్వారా రూ.ఐదు లక్షలు రాక పోతే నా కూతురు సంధ్య పెండ్లికి చేసిన అప్పులను నా భర్త పేరు మీద ఉన్న 20 గుంటల భూమిని అమ్మి అప్పులు తీర్చే దాన్ని. నా భర్త చనిపోయిన కొద్ది రోజులకే నాకు రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు చేతికి అందినయ్. వెంటనే అప్పులన్నీ తీర్చిన. నాకు ఇద్దరు కూతుళ్లు, మూగ కుమారుడు సుమన్ ఉన్నారు. నాకు బీడీల పింఛన్, నా కుమారుడికి దివ్యాంగుల పింఛన్ కలిపి నెలకు రూ.ఐదు వేలు వస్తున్నాయి. పింఛన్ డబ్బులతో ఇల్లు గడుస్తున్నది. ఇంత సహాయం చేసిన సీఎం కేసీఆర్ సార్కు జీవితమంతా రుణపడి ఉంటా. నా భర్త పేరు మీద ఉన్న 20 గుంటల భూమిని పైసా ఖర్చు లేకుండా నా పేరు మీద చేసుకున్న. గరీబోళ్లకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సాయం మరవలేనిది.
– మేకల నాగమణి, తాడ్గామ
కేసీఆర్ సార్కు రుణ పడి ఉంటా..
నవీపేట, మే 14: రైతుబీమాతో ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటా. నాతోపాటు నా భర్త యశ్వంత్రావుకు రెండేండ్ల క్రితం కరోనా వ్యాధి సోకింది. నాకు నయం అయ్యింది. నా భర్తకు సీరియస్గా ఉండడంతో హైదరాబాద్ తీసుకుపోయినం. దవాఖానల రూ.ఎనిమిది లక్షల దాక ఖర్చయ్యింది. అయినా ఆయన బతుకలేడు. నాకు కుమారుడు, కూతురు ఉన్నారు. నా భర్త పేరు మీద కొద్దిపాటి భూమి ఉన్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా ద్వారా రూ.ఐదు లక్షలు వచ్చినయ్. నా భర్త ఆరోగ్యం బాగు పడేందుకు చేసిన అప్పులను రైతుబంధు డబ్బులతో తీర్చిన. రైతుబీమా డబ్బులు నాకు బాగా అసరా అయినయ్. మా ఊరిలో మరికొంత మందికి కూడా రైతుబీమా డబ్బులు వచ్చినయ్.
– కదం సావిత్రి, పొతంగల్