నిజామాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి కేసీఆర్ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. ఉచిత విద్యుత్ పథకం రజక, నాయీబ్రాహ్మణ కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నది. లాండ్రీలు, సెలూన్లకు కరెంట్ బిల్లు బాధలను తప్పించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ సత్ఫలితాలను అందిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో లేకున్నప్పటికీ ఆయా కుటుంబాల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి.. వారి మేలుకోసం తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకం ఎంతో మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తున్నది. గతంలో వాణిజ్య కేటగిరీలో ఉండడంతో సెలూన్, లాండ్రీ, దోభీఘాట్ నిర్వాహకులు కరెంట్ బిల్లులతో సతమతమయ్యే వారు. అయితే కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన పథకంతో విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తొలిగిపోయింది. సెలూన్, దోభీఘాట్, లాండ్రీ షాపులకు ఉచితంగానే 250 యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతున్నది. విజయవంతంగా అమలవుతున్న ఈ పథకంతో ఆయా వర్గాల ప్రజలంతా హర్షం వ్యక్తంచేసున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రజక కులస్తులకు చెందిన 1,508 లాండ్రీలు, దోభీఘాట్లకు, నాయీ బ్రాహ్మణులకు చెందిన 2,057 సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్నది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 3,565 మందికి లబ్ధి కలుగుతున్నది.
కొండంత అండగా కేసీఆర్..
సీఎం కేసీఆర్ సారథ్యంలో వ్యవస్థలను మార్చే మహాద్భుత విప్లవాలకు తెలంగాణ వేదిక అవుతున్నది. ప్రజల ప్రతి కష్టానికి ప్రతిఫలం, వారి ప్రతి సమస్యకూ పరిష్కారం అన్నది ప్రభుత్వం చేసి చూపిస్తున్నది. ఫలితంగా తెలంగాణ బతుకు చిత్రం సమూలంగా మారి, సరికొత్తగా ఆవిష్కృతమవుతున్నది. సంకుచిత ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయ అవసరాల కోసం తెలంగాణ జన జీవనాన్ని నరకప్రాయం చేసిన గత ప్రభుత్వాల తప్పులను సరిదిద్దుతూ, మునుపటి అంధకారాన్ని ఛేదిస్తూ, గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ వాకిట ప్రగతి పూలు పూయిస్తున్నది కేసీఆర్ సర్కారు. సామాన్యుడి కష్టం తెలిసిన సర్కారు.. ప్రజల సమస్యలను వాస్తవిక దృష్టితో అర్థం చేసుకొని పరిష్కరిస్తున్నది. బడుగు, బలహీన వర్గాలకు కొండంత అండగా నిలస్తున్నది. కులవృత్తినే జీవనాధారం చేసుకుని బతుకీడుస్తున్న అనేక కుటుంబాలు ఏండ్ల పాటు నిరాదరణకు గురయ్యాయి. కులవృత్తులనే నమ్ముకున్న కుటుంబాలను గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందిందే లేదు. కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆయా కుటుంబాలకు జీవం పోస్తున్నారు.
కులవృత్తులకు జీవం..
తెలంగాణలోని పల్లెల్లో నిర్లక్ష్యానికి గురైన కుల వృత్తిదారుల బాగు కోసం కేసీఆర్ కృషి చేస్తుస్తున్నారు. ముఖ్యంగా చేనేత, కుమ్మరి, రజక, గొల్ల, కుర్మల దగ్గరి నుంచి నాయీ బ్రాహ్మణులు, రజకులకు చేయూతనిస్తున్నారు. రజక వర్గాన్ని గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై ఆ వర్గానికి చెందిన వారు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి పోయారు. దోభీఘాట్లకు నీటి వినియోగం కోసం కరెంట్ వాడకం మూలంగా చార్జీలు ఎడాపెడా రావడంతో రజకులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. చేసిన కష్టమంతా కరెంట్ బిల్లులు, ఇతరత్రా నిర్వహణకు పోవడంతో చేతికొచ్చే ఆదాయం సరిపోక పోయేది. కానీ కేసీఆర్ తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకం వారికి కొండంత అండగా మారింది. కుల వృత్తులను నమ్ముకున్న వారిని సీమాంధ్రులు పట్టించుకోకపోవడంతో భరోసా లేక వారంతా నిరాశ, నిస్పృహలో మునిగిపోయారు. కానీ సీఎం కేసీఆర్ కుల వృత్తిదారులకు అండగా నిలిచి అనేక పథకాలను తీసుకు రావడం ద్వారా వారిలో ధైర్యం కనిపిస్తోంది.
ఉచిత విద్యుత్ వెలుగులు..
క్షౌరశాలలు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు 250 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని రజకులు, నాయీ బ్రాహ్మణులు పూర్తి స్థాయిలో లబ్ధి పొందుతున్నారు. ఉభయ జిల్లాల్లో ఉచిత విద్యుత్ పథకంతో 3,565 మందికి ప్రయోజనం కలుగుతున్నది. వీరికి గతంలో ఎన్పీడీసీఎల్ ద్వారా మంజూరైన మీటర్ ఏకంగా వాణిజ్య పరిధిలో ఉండేది. తద్వారా విద్యుత్ బిల్లు తడిసి మోపెడయ్యేది. ఇప్పుడా బాధ తీరింది. ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థకు ప్రభుత్వమే మొత్తం విద్యుత్ భారాన్ని చెల్లిస్తున్నది.
విద్యుత్ రాయితీని ప్రభుత్వమే చెల్లిస్తుంది..
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 250 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నాం. పారదర్శకంగా ఈ పథకం పరిధిలోని లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఇది వరకే సెలూన్లు, దోభీఘాట్లు, లాండ్రీ దుకాణాలు నిర్వహిస్తున్న వారంతా పాత విద్యుత్ మీటర్ల బిల్లు కాపీలను ఆధారంగా చేసుకుని పథకాన్ని వర్తింపజేశాము. లాండ్రీ, దోభీఘాట్, సెలూన్ నిర్వాహకులకు కమర్షియల్ సెగ్మెంట్లో ఎలక్ట్రిసిటీ మీటర్ ఉండేది. ఇప్పుడు వారికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతున్నది. ఇందుకయ్యే మొత్తం రాయితీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
– శ్రీనివాస్, బీసీ
సంక్షేమాధికారి, నిజామాబాద్ జిల్లా
సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటా
బాల్కొండ : ఏండ్ల సంది బట్టలు ఇస్త్రీ చేసుకుంట బతుకుతున్న. అప్పట్ల బొగ్గుల పెట్టెతో చేసేటోడ్ని. ఒక్క డ్రెస్కు ఆరు రూపాయలు తీసుకునేటోడ్ని. రోజుకు 15జతల వరకు ఇస్త్రీ చేస్తుంటి. దినాం 150 నుంచి 200 రూపాయలు దొరికేవి. అచ్చినదాంట్ల సగం బొగ్గులకే పోయేటివి. ఇల్లు గడవాలంటే కష్టమైతుండె. సీఎం కేసీఆర్ అచ్చినంక మాకు 100 యూనిట్ల వరకు పుక్యం కరంటు ఇస్తుండు. ఇప్పుడు కరంటు పెట్టెతోటి ఇస్త్రీ చేస్తున్న. సంపాయించిన పైసల్తోటి ఇల్లు ఎల్లదీస్తున్న..ఇంకొన్ని మిగులుతున్నయ్. దీనంతటికి కారణం సీఎం కేసీఆర్ సారే. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంట.
కేసీఆర్ది పవర్ ఫుల్ ప్రోత్సాహం
కమ్మర్పల్లి :మంగళి వృత్తి వారికి సీఎం కేసీఆర్ పవర్ఫుల్ ప్రోత్సాహం అందిస్తున్నారు. గతంలో మంగళి వృత్తి నిర్వహణలో విద్యుత్ అవసరం అంతగా ఉండేది కాదు. మారుతున్న కాలంతోపాటు కొత్త పోకడలతో, వేగంగా వృత్తిని చేసుకునే పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా మారిన విద్యుత్ మాకు భారం కాకుండా సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ అందజేసి మా వృత్తికి అండగా నిలిచారు.
ఉచిత కరెంటుతో ఇబ్బందులు తప్పినయ్..
డిచ్పల్లి: గతంలో దుకాణం నడపాలంటే కరెంటు బిల్లుకే అధిక డబ్బులు ఖర్చు అయ్యేది. సీఎం కేసీఆర్ తమపై దయచూపి రజకులకు ఉచితంగా విద్యుత్ను అందిస్తుండడంతో ఇబ్బందులు తప్పినయ్. ఇప్పుడు సంతోషంగా దుకాణాలను నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– లక్ష్మణ్, ఎల్లారెడ్డిపల్లి
ఇప్పుడు ఇబ్బంది లేదు: గోపాల్, బాల్కొండ, కటింగ్ నిర్వాహకుడు
బాల్కొండ, జనవరి 3: మాకు ప్రతినెలా విద్యుత్ బిల్లు చెల్లించడం భారంగా ఉండేది. ఇంటి కిరాయి, కరెంట్ బిల్లు, వర్కర్ల జీతం ఇచ్చేందుకే ప్రతినెలా సంపాదన సరిపోయేది. ఇంతటి కష్టకాలంలో కరెంట్ ఫ్రీగా ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
వెయ్యికి పైగా బిల్లు వచ్చేది..-మర్రి పెద్ద లక్ష్మన్, తిమ్మాపూర్
మోర్తాడ్, జనవరి 3: నెలకు వెయ్యి రూపాయలకు పైగా బిల్లు వచ్చేది. బిల్లు కట్టాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు 250యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తుండడంతో బిల్లు రావడం లేదు. సంతోషంగా ఉంది. అన్ని కులాలకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి కేసీఆర్ సార్ మనకు సీఎంగా ఉండడం అదృష్టం. ఇలాంటి సీఎం ఉంటే భవిష్యత్తులో మరింత లబ్ధి చేకూరుతుంది.
ఇప్పటిదాక పట్టించుకున్నోళ్లే లేరు
మోర్తాడ్, జనవరి 3: మాలాంటి వాళ్లను ఇప్పటి వరకు పట్టించుకున్న వాళ్లనే చూడలేం. కానీ, తెలంగాణ వచ్చినంక వీళ్లను పట్టించుకోవడం లేదు అన్న పరిస్థితి లేదు. అన్నివర్గాల విషయంలో న్యాయం జరిగేలా చూస్తున్నారు. మా మంగళిషాప్లకు కరెంటు ఫ్రీగా ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
భారం తగ్గింది.. రాచకొండ మధు, నాయీబ్రాహ్మణుడు, పోచంపాడ్
మునుపు కటింగ్ షాపులో విద్యుత్ వినియోగం అంతగా అవసరముండేది కాదు. మారుతున్న కాలంతో విద్యుత్ పరికరాలు వాడాల్సి వస్తున్నది. ప్రతినెలా రూ. 1000కి పైగా కరెంట్ బిల్ వచ్చేది. ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ కాల్చుకునే వెసులుబాటును కల్పించింది. దీంతో మాపై పడుతున్న ఆర్థిక భారం తగ్గింది. అన్నివర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సర్కార్ ఏదైనా ఉందంటే అది కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఇది వరకున్న పాలకులెవ్వరూ కులవృత్తులు చేసుకునే వాళ్ల కుటుంబాల గురించి ఆలోచించిన పాపన పోలేదు.