‘తొమ్మిదిన్నరేండ్ల దినంల ఎవుసం ఎంతో మంచిగైంది. సర్కారు అన్నితీర్ల సాయం జేసుడుతోడి సంతోషంగా ఉన్నాం. పెట్టుబడికి పైసలియ్యవట్టె. ఫుల్లుగా కరెంటియ్యవట్టె. పండించిన పంటల్ని కొనవట్టె. గింతకంటే మంచిగా ఏ సర్కారోళ్లు చూసుకుంటరు. మునుపు కాంగ్రెసోళ్ల దినంల మస్తు తిప్పలువడ్డం. కరెంట్ ఇయ్యలె. నీళ్లు ఇయ్యలె. మద్దతు ధర ఇయ్యలె. గంతెందుకు భూముల పంచాయితీ వడ్తె తిరిగి తిరిగి కాళ్లరుగుతుండె తప్పితే దేకినోడు లేకుండె. ఇయ్యాళ భూ పంచాయితీల్లేవు. కరెంట్ కోతల్లేవు. భూమిని నమ్ముకుని బతికేటోళ్లం. కాయకష్టాన్ని నమ్ముకున్నోళ్లం. మాకు మంచి జేసిన కేసీఆర్ సారును మరువం’ అని రైతులు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుందో తమకు ఎరుకేనని, ఆ పార్టీని నమ్మబోమని స్పష్టం చేస్తున్నారు.
రద్రూర్: అప్పట్ల భూమి అమ్మినా, కొన్నా పట్వారీలు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతుండె. పది.. ఇరవై మందిని వెంటేసుకొని వారం రోజులు తిరిగేదాకా పాట్టా కాకుండే. రేపు రా.. మాపు రా.. అని చుట్టూ తిప్పుకుంటూ… బాగా సతాయిస్తుండె. దళారులు, పట్వారీలు మస్తు లంచం తీసుకుంటుండె. ధరణితో అలాంటి కాలం పోయింది. ఇప్పుడు దర్జాగా తహసీల్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నరు.
ధరణిని తీసేస్తా అనే కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయంమీద కొంచమైనా అవగాహన ఉందా? ధరణి పోతే భూమి వివరాల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పని ఉంటుంది. ఇప్పుడు ఇంటినుంచే భూమి వివరాలను ధరణి ద్వారా తెలుసుకుంటున్నాం. ఇదంతా కేసీఆర్ సార్ పుణ్యమే. రైతులను ఆగం పట్టించడానికే కాంగ్రెసోల్లు నాటకాలు ఆడుతున్నారు.
చందూర్: గీ ధరణి లేకముందు పట్టా జేసుకోవాలన్నా.. భూమి అమ్మాలన్నా మస్తు బాధ అయితుండె. పట్వారీలు, దళార్లు, ఆఫీసర్లు మస్తు తిప్పిస్తుండ్రి. కేసీఆర్ సర్కారు ధరణి పెట్టినంక మొత్తం మారిపోయింది. మేము భూమి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం మీ సేవ కేంద్రానికి పోయి దరఖాస్తు పెట్టుకున్నం. తెల్లారే తాశిల్ ఆఫీస్కు పిలిపించిండ్రు. అక్కడ అర్ధగంటలో పని పూర్తిచేసిండ్రు. నా పాత పట్టా పాస్ పుస్తకంలో కండ్ల ముంగటనే కొత్త భూమిని ఎక్కిచ్చి ఇచ్చిండ్రు. చాలా అనందం అనిపించింది.
కాంగ్రెస్ పాలన ఉన్నపుడు పల్లెల్లో మొత్తం పటేండ్లు, పట్వారీలదే పెత్తనం ఉంటుండె. బెత్తెడు జాగ అమ్మాలన్నా, కొనాలన్నా వాళ్లు చెప్పినట్టే వినాల్సి ఉండేది. లేకపోతే పట్టా చేయకపోయేది. మస్తు సతాయిస్తుండె. ఎదురు మాట్లాడితే.. నీకు భూమే లేదంటుండె. ఎందుకుంటే రికార్డులన్నీ వాళ్ల చేతుల్లోనే ఉంటుండె. సీఎం కేసీఆర్ పుణ్యమా అని.. ఇప్పడు ఆ కాలం పోయింది. అన్ని భూములను కంప్యూటర్లకు ఎక్కిచ్చిండ్రు. కబ్జా చెయ్యాలంటే ఎవడి తరం కాదు. గంట లోపట భూమి రిజిస్ట్రేషన్ అయిపోతున్నది.
ధరణితో ప్రతి ఒక్కరి భూమికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ధరణిని తీసేసి.. చేత్తో రాసే పని పెట్టుకుంటే భూములన్నీ కిందమీద చేస్తరు. అధికారులు డబ్బులకు ఆశపడి ఒకరి భూమిని వేరొకరి పేరిట రాస్తరు. దీంతో భూమి అమ్మాలన్నా, కొనాలన్నా చాలా ఇబ్బందులు ఎదరుర్కోవాల్సి ఉంటుంది. మన భూములకు గ్యారంటీ ఉండదు.
కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తమంటున్నరు. రేవంత్రెడ్డి మాటలింటే గుండెల రాయి వడ్డంత పనైంది. ధరణి రాకముందు మేం పట్టా జేసుకునేటందుకు మస్తు తిరిగినం. సర్వే నంబర్ లేకపోతే మ్యుటేషన్ కోసం పట్వారీకి లంచం ఇచ్చి.. ఆయన సుట్టూ యాడాది తిరిగినం. మళ్లా బోధన్ రిజిష్టర్ ఆఫీస్కు పొద్దూ మాపూ నాల్గు దినాలు పోయినం. గప్పుడు పని అయ్యింది. ఇప్పడైతే అల్కగ పట్టా చేస్తుండ్రు. మనకు ఎప్పడు తీరిక ఉంటే అప్పుడు తారీఖ్ ఇస్తరు. మండల్ ఆఫీస్కు పోతే సాలు.. నిమిషాలల్ల పని చేసి ఇంటికి పంపిస్తున్నరు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామంటున్నారు. ధరణితో వారికి వచ్చిన సమస్య ఏమిటో అర్థం కావడం లేదు. భూములన్నీ బీఆర్ఎస్ సర్కారు పకడ్బందీగా ఆన్లైన్ చేసింది. ఎలాంటి గొడవలూ లేవు. కాంగ్రెస్ వస్తే ఇక రోజూ భూమి పంచాయతీలే. పట్టాలన్నీ గోల్మాల్ చేసేస్తారు. నా భూమి.. నీ భూమి అని రైతులు కొట్టుకొని సావాలె. రిజిస్ట్రేషన్ కోసం నెలల తరబడి ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరగాలె. బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన ధరణి పోర్టల్తో.. రైతులు ఎవడి కాళ్లూ పట్టుకునే పనిలేకుండానే దర్జాగా పట్టా చేసుకుంటున్నడు.
నా చిన్ననాటి నుంచి వ్యవసాయం చేస్తున్న. మోట కొట్టి పొలానికి నీరు పారించిన. కాంగ్రెస్ పాలనలో అరకొర కరెంట్తో అవస్థలు పడ్డ. రాత్రంతా పొలాల్లో గుడిసె వేసుకుని పాములు విష పురుగులతో బాధలు పడ్డా. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ఒక్కోటి బాగు చేసుకుంటా వచ్చిండు. 24గంటలు ఉచిత కరెంటు ఇచ్చి ఎవుసాన్ని పండుగ జేసిండు. దాన్ని ఓర్వలేక రైతన్నను ఆగం చేయడానికి కాంగ్రెసోళ్లు కుట్ర చేస్తున్నరు. రైతులను ముంచాలని చూస్తున్న రేవంత్కు తగిన గుణపాఠం చెప్తం.
రుద్రూర్ : కాంగ్రెస్ పార్టీని నమ్మితే రైతులకు మళ్లీ కరెంటు బాధలే. రాత్రిపూట పొలాలకు పోవాల్సి వస్తుంది. మూడు గంటల కరెంటు ఇస్తే పొలాలు సరిగ్గా పండక అప్పులపాలవుతాం. కరెంటు సరిగ్గా రాక పంటలు ఎండిపోతయ్. మోటర్లు కాలిపోతయ్. కాంగ్రెస్ రైతులను అయోమయంలో పడేస్తోంది. రైతులు 10హెచ్పీ మోటర్లు కొనలేరు. ఆ మోటర్లను వాడితే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయి. మొత్తం అన్నీ మార్చడం సాధ్యం కాదు. అప్పట్లో కరెంటు కోసం ధర్నా చేసినం.
ఎన్నికల టైంల రేవంత్రెడ్డి ఏం మాట్లాడుతున్నడో ఆయనకే అర్థమైతలేదు. ఎవరైనా మూడు గంటల కరెంటుతో పంటలు పండిస్తరా? మనం ఏ కాలంలో ఉన్నం. చంద్రమండలం మీద ప్రయోగాలు చేస్తున్న రోజుల్లో పాతకాలం నాటి మాటలు మాట్లాడితే ఎట్లా. అసలు రేవంత్కు వ్యవసాయం అంటే తెలుస్తదా? తెలిస్తే ఈ 10హెచ్పీ మోటరు పెడ్తా అనడు. అయినా రైతులు రేవంత్ను, కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్లు జేసే ఆగమాగం పనులను గమనిస్తున్నం. సీఎం కేసీఆర్తోనే మా భూములు పచ్చబడ్డయి. మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఇంత మంచి చేసిన కేసీఆర్ను వదులుకుంటమా? కేసీఆర్నే గెలిపిస్తం.
బోర్లలో 10హెచ్పీ మోటరు వేసి నీళ్లు తోడాలంటే భూమిలో అంత నీరుండాలి కదా. ఆ మోటరు వ్యవసాయానికి పనికిరాదు. కాంగ్రెసోళ్లు చెప్పినట్లు మూడు గంటల కరెంటుతో ఎవుసం చేయలేం. పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. రైతులకు మళ్లీ కష్టాలు ఎదురవుతాయి. దీంతో పచ్చని పంట భూములన్నీ బీడుగా మారే ప్రమాదం ఉన్నది. వ్యవసాయం బంద్ అయితే దాని ప్రభావం అన్నింటిపై పడుతుంది. సాగు విస్తీర్ణం తగ్గిపోయి ధాన్యం కొరత ఏర్పడే అవకాశం ఉన్నది. కేసీఆర్ పాలనలో మంచిగైన వ్యవసాయాన్ని కాంగ్రెసోళ్లు వచ్చి ఖతం చేయాలని చూస్తున్నరు. అట్లాంటి కాంగ్రెసోళ్లను అధికారంలోకి రాకుండా చూస్తాం. ఓటుతో బుద్ధి చెప్తాం.
కాంగ్రెసోళ్ల పాలనలో పొలాలకు రాత్రి టైంల కరెంటు ఇస్తే.. కరెంటు రాంగనే ఆత్రమాత్రం పొలాలకు వెళ్లిన రైతులు ప్రమాదాల బారినపడి చనిపోయిండ్రు. చీకట్లో పాముకాట్లతో కొంతమంది సచ్చిపోతే. రాత్రిపూట సుద్రాయించక కరెంటు షాక్తో మరికొంత మంది రైతులు సచ్చిపోయిండ్రు. ఇప్పుడు మళ్లా మూడు గంటల కరెంటు ఇస్తే అదే పరిస్థితి వస్తది.
కాంగ్రెసోళ్లు చెబుతున్న మూడు గంటల కరెంటు, 10హెచ్పీ మోటర్లతో రైతులకు అన్నీ కష్టాలే. చిన్న, సన్నకారు రైతులు 10హెచ్పీ మోటర్లు కొనే పరిస్థితే ఉండదు. మూడు గంటల కరెంటు అంటే అందరూ ఒకేసారి మోటర్లు ఆన్ చేస్తరు. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. కాంగ్రెసోళ్ల పాలనలో రైతులంతా రోడ్లెక్కి ధర్నాలు చేసినా కరెంటు ఇవ్వలేదు. పంట చేతికొచ్చిన సమయంలో కరెంటు ఇబ్బందులతో నష్టపోయింది చాలు. కాంగ్రెస్ నాయకుల పిచ్చి మాటలను నమ్మొద్దు. బీఆర్ఎస్ ఇస్తున్న 24 గంటల కరెంటుతో దర్జాగా వ్యవసాయం చేస్తున్నం. కాంగ్రెసోళ్లు వస్తే కరెంటు కోసం మళ్లీ రోడ్లపై ధర్నాలు చేసే పరిస్థితి దాపురిస్తుంది.
చందూర్: సీఎం కేసీఆర్ పాలనలో రైతు రాజు లెక్క బతుకుతుండు. మళ్లా ఈ కాంగ్రెసోళ్ల లొల్లి ఏందో అర్థమైతలేదు. 3 గంటల కరెంటు, 10హెచ్పీ మోటర్లు పెట్టాలంటున్నడు. రైతులకు నష్టమైన పనులు ఎందుకు చేయాలనుకుంటున్నరు. రైతులు ఊరుకుంటరా ముందే బొందపెడ్తరు. రైతన్నకు ఇబ్బందిపెట్టి నోడు చరిత్రల నిలువలె. చరిత్రహీనులుగా పేరు తెచ్చుకున్న వాళ్లలో రేవంత్ ఒకడు. రైతు దర్జాగా బతుకుతున్న సమయంలో ఈపిచ్చి కూతలు కూసుడు సరికాదు. రైతన్న కన్నెర్ర చేస్తే భస్మం అవుతడు.
కాంగ్రెసోళ్లకు వ్యవసాయంపై అవగాహన లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే ఏ పనిచేసుకోవాలన్నా సుదురాయించదు. 10హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే ఓవర్ లోడ్తో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోతాయి. రైతులకు చాలా నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన 24 గంటల కరెంటు ఇస్తుండడంతో రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నరు. రైతులకు రాత్రి పొలాల కాడికి పోయే బాధ తప్పింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడే కరెంటు వాడుకుంటున్నాం. రైతులందరికీ నాణ్యమైన కరెంటు వస్తున్నది. మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెసోళ్లకు కర్రు కాల్చి వాత పెడ్తం.