బాన్సువాడ/బాన్సువాడ రూరల్,, నవంబర్ 28 : బాన్సువాడ పట్టణంలో ఇల్లు, స్థలం లేని పేదలకు సొంత ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలో మంగళవారం పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 19 వార్డుల నుంచి వేల మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు, యువకులు, పోచారం అభిమానులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత స్థలం, ఇల్లు లేక కిరాయికి ఉంటున్న పేదలందరికీ తాడ్కోల్ శివారులో ఉన్న 14 ఎకరాల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో యువత కోసం పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేసి, ఈ ప్రాంత బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. బాన్సువాడ పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీరు ఇచ్చేలా రూ.52 కోట్లతో అమృత్ పథకం కింద తాగునీటి ప్రాజెక్టు మంజూరు అయిందని తెలిపారు. మిషన్ భగీరథ తాగునీరు వచ్చేలా పైప్లైన్లు ఏర్పాటు చేయించానని చెప్పారు. మై పక్కా లోకల్.. బాన్సువాడకే పబ్లిక్ పక్కా లోకల్.. పక్కా నియోజకవర్గం నుంచి వచ్చిన ఏనుగు రవీందర్రెడ్డిని బాన్సువాడ ప్రజలు తంతే బంగాళాఖాతంలో పడాలని, నియోజకవర్గ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పోచారం పిలుపునిచ్చారు.
బాన్సువాడ నియోజకవర్గానికి 11 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు తెచ్చి పేదలకు ఇచ్చానని అన్నారు. పదేండ్లల్లో బాన్సువాడను అద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పారు. నేను మీ వాడిని.. మీ కుటుంబ సభ్యుడిని.. నిండు మనస్సుతో మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను పోచారం విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో వేలాదిగా తరలివచ్చిన అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రచారంలో మహిళల నృత్యాలు, డ్యాన్సులతో, జై పోచారం, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మహ్మద్ ఎజాస్, పిట్ల శ్రీధర్, గోపాల్రెడ్డి, వాహబ్, ఖమ్రొద్దీన్, మీరా సేట్, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఖాన్, ఎఎంసీ వైస్ చైర్మన్ రాజు, అందెరాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రమన్ను కుచ్చలో స్పీకర్ పోచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచు రాజమణి, జడ్పీటీసీ పద్మ, బుడ్మి సొసైటీ చైర్మన్ గంగారాం, నాయకులు గోపాల్రెడ్డి, రాజు, లక్ష్మాగౌడ్ తదితరులు ఉన్నారు.