ప్రైవేటు దవాఖానల్లో అడుగు పెట్టాలంటే వేలు, లక్షల రూపాయలు చేతిలో పట్టుకోవాలి. ఇలాంటి తరుణంలో పేద, గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిందే ‘ఐ కేర్ హెల్త్ సర్వీసెస్’. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి చెందిన ఉడుతల నరేశ్ గౌడ్ అనే యువకుడు పోచారం సురేశ్, భవానీ అనే ఇద్దరు కో- ఆర్డినేటర్లతో కలిసి ఈ స్వచ్ఛంద సంస్థను మూడేండ్ల క్రితం ఏర్పాటు చేశారు. వంద రూపాయలకే వైద్య సేవలందిస్తున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఇప్పటి వరకు వేల సంఖ్యలో బాధితులకుబాసటగా నిలిచారు.
-శక్కర్నగర్, డిసెంబర్ 16
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పించి వైద్యులను అందుబాటులో ఉంచడంతో అక్కడ కూడా రోగుల సంఖ్యల పెరుగుతున్నది. దీంతో కొందరు ప్రైవేటు దవాఖానలకు వెళ్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ డాక్టర్ ఫీజుతోకలిపి వివిధ రకాల టెస్టులకు వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో తక్కువ ఫీజుతో సేవలు అందించేందుకు ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి చెందిన ఉడుతల నరేశ్ గౌడ్ అనే యువకుడు మూడేండ్ల క్రితం ‘ఐ కేర్ హెల్త్ సర్వీసెస్’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఇద్దరు కో-ఆర్డినేటర్లు, మరో 20 మంది సభ్యులతో కలిసి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. కేవలం వంద రూపాయల ఫీజుతోనే గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. మండల కేంద్రాల్లో 28 శిబిరాలు నిర్వహించి ఇప్పటివరకు సుమారు 6వేల మందికిపైగా వైద్య పరీక్షలు చేశారు. కొవిడ్ సమయంలో గర్భిణులు, సీనియర్ సిటిజన్లకు ఇంటివద్దనే కరోనా టెస్టులతోపాటు ఇతర వైద్య సేవలు అందించారు.
నిజామాబాద్లోని ఖలీల్వాడి ప్రాంతంలో ‘ఐకేర్ హెల్త్ సర్వీసెస్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతినిత్యం సేవలందించేందుకు ఓ ‘హెల్త్ క్లినిక్’ను ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్లో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఫోన్ చేసి (9505554108, 9505553108) అపాయింట్మెంట్ తీసుకునే వీలు కల్పించారు. ఇక్కడ ఉదయం10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జనరల్ ఫిజీషియన్ అందుబాటులో ఉంటారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన మందులు రాయడం లేదా ఇతర సమస్యలు ఉంటే స్పెషలిస్టులకు రిఫర్ చేస్తున్నారు.
బేసిక్ హెల్త్ చెకప్ కోసం గ్రామీణ, పేద, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానల్లో వైద్యులను సంప్రదించాలంటే ఖర్చుతో కూడుకున్నది. ఇలాంటి వారికి సేవలందిచేందుకే ‘ఐ కేర్ హెల్త్ సర్వీస్’ సంస్థను ఏర్పాటు చేశాం. ఇందులో భాగంగా విస్తృతంగా శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తున్నాం. తక్కువ ఫీజుతో వ్యాధులను ప్రాథమికస్థాయిలోనే గుర్తించే అవకాశం కల్పించి ప్రజలకు భరోసా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో సంస్థ సేవలను విస్తరిస్తాం. వివిధ బీమా కంపెనీలను సంప్రదించి ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. మేం అందిస్తున్న సేవలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కడం గర్వంగా ఉంది.
-ఉడుతల నరేశ్ గౌడ్, ఫౌండర్, ఐ కేర్ హెల్త్ సర్వీసెస్
‘ఐకేర్ హెల్త్ సర్వీసెస్’ స్వచ్ఛంద సంస్థ సేవలను జిల్లా అధికార యంత్రాంగం గుర్తించి స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి ఉడుతల నరేశ్గౌడ్ను అభినందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, అతి తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్న ఈ సంస్థను తెలంగాణ స్టేట్ ఇంక్యూబెటర్ సెంటర్ టీ హబ్-2.ఓ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ సోషల్ ఎంటర్ప్రైజెస్గా ఎంపిక చేశారు. ఈ నెల 9న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ సేవలను మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. సంస్థకు పూర్తిస్థాయి సహాయ సహకారాలతోపాటు ప్రోత్సాహం అందించేందుకు హామీ ఇచ్చారు.