మోస్రా (చందూర్)/ కోటగిరి / నిజామాబాద్ స్పోర్ట్స్/ శక్కర్నగర్/నవీపేట, డిసెంబర్ 18 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో తమకు ఉపాధి కరువై బతుకుదెరువు కష్టమైందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో ఆటోడ్రైవర్లు సోమవారం రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పించారు.మోస్రా
లో వెంకటేశ్వర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తహసీల్దార్ సాయిలుకు వినతిపత్రం అందజేశారు. పొతంగల్ మండలకేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట ఆటోయూనియన్ నాయకులు, ఆటోడ్రైవర్లు, యజమానులు ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
జిల్లాకేంద్రంలో నగరానికి చెందిన ఆటోడ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆటో మోటర్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బచ్చల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి అమలులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమయ్యాయని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు అబ్దుల్ గఫార్, సాయిలు, షేక్ అబ్దుల్ జబ్బార్, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ బోధన్ పట్టణంలో ఆటో యూనియన్ ప్రతినిధులు, ఆటో యజమానులు, డ్రైవర్లు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా బోధన్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని కార్యాలయ పరిపాలనాధికారి విఠల్కు వినతిపత్రం అందజేశారు. ఆటో యూనియన్ నాయకులు మహ్మద్ అయూబ్, రయీస్ ఖాన్, మహ్మద్ ముఖీం, సయ్యద్ జాకీర్, గజపాక సాగర్, ఎండీ లాయఖ్ అహ్మద్, షేక్ మొయిన్, ఎండీ సర్వర్ ఖాన్, రషీద్ సుభానీ పాల్గొన్నారు.
నవీపేట మండలం జన్నేపల్లి చౌరస్తాలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు ఆలూర్ అరుణ్, ప్రధాన కార్యదర్శి ఈదోల్ల సందీప్ కార్మికులు పాల్గొన్నారు.