సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. ఇలా విధించిన చలానాలు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుకుపోయాయి. దీంతో వారికి ఊరట కల్పిస్తూ ప్రభుత్వం డిసెంబర్ 28న భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. దీంతో పెద్ద మొత్తంలో చలాన్ల ఫైన్ ఉన్న వాహనదారులు డిస్కౌంట్తో ఫైన్ చెల్లించే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఈ నెల 10వరకు మాత్రమే ఉండడంతో బకాయిలు చెల్లించేందుకువాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. మీ సేవ, ఈ సేవ కేంద్రాలతోపాటు ఆన్లైన్లో సైతం ఈ చలానా చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్తో సుమారు 2 లక్షల వాహనదారులకు ప్రయోజనం కలుగనున్నది. హెల్మెట్ ధరించకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ప్లేట్ లేకుండా వాహనం నడపడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఇన్సూరెన్స్ లేకపోవడంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లో వాహనం నడపడం తదితర నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. వీరందరికీ రాయితీతో కూడిన బకాయిలు చెల్లించే అవకాశం లభించించడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, జరిమానాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ రాయితీ ప్రకటించింది. ఈ ప్రకటన వాహనదారులకు కొంత ఊరట కలిగించింది. డిసెంబర్ 26 నుంచి ఈ నెల10 వరకు ఆన్లైన్లో పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.టూ/త్రీ వీలర్ వాహనదారులకు జరిమానా చెల్లింపులో 80 శాతం, కార్లు, భారీ వాహనాలకు 60 శాతం, ఆర్టీసీ వాహనాలకు 90 శాతం రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించేవారికే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న 3, 34,644 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.వీరికి సంబంధించి గత డిసెంబర్ 27 నాటికి రూ.14.15కోట్లకు పైగా జరిమానా బకాయిలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో నుంచి డిసెంబర్ చివరి వరకు సుమారు 35 శాతం జరిమానా వసూలైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వం డిస్కౌంట్లో కూడిన ఆఫర్ ప్రకటించడంతో వాహనదారులు పెండింగ్ జరిమానాలు చెల్లించేందుకు ముందుకువస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8 వరకు సుమారు రూ.3 కోట్ల వరకు పెండింగ్ చలాన్లు వసూలైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా ఈ-చలానా జరిమానాలు మరో రూ.6 కోట్ల వరకు ఉంటాయని పేర్కొన్నాయి.
పెండింగ్ చలాన్ల వసూలు కోసం పోలీసు యంత్రాంగం వినూత్న ప్రచారం చేపట్టింది. మునుపెన్నడూ లేని విధంగా జరిమానాను రాబట్టేందుకు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రధానకూడళ్లు, జంక్షన్లలో పెండింగ్ చలానా చెల్లించడానికి ప్రభుత్వం కల్పించిన డిస్కౌంట్ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలంటూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రధానప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు మైక్ల ద్వారా ప్రచారం చేస్తుండడం విశేషం