ఎడపల్లి, అక్టోబర్ 14: మండలంలోని జాన్కంపేట్ శివారులో ఉన్న శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శనివారం అష్టమి, అమావాస్య కలిసి రావడంతో ఆలయ ప్రాంగణంలోని అష్టముఖి కోనేరులో స్నానమాచరించి, ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే పాపాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇందులో భాగంగానే శనివారం అమావాస్య, అష్టమి వచ్చే రోజున ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు.
ఉదయం నుంచి భక్తుల వేల సంఖ్యలో హాజరయ్యారు. ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. అష్టముఖి కోనేరు మధ్యలోకి వెళ్లకుండా కర్రలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కోనేరు వద్ద ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. భక్తుల క్యూలో తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాలు, మండలానికి చెందిన వారే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
ఆలయంలో తెల్లవారు జామున స్వామివారికి అభిషేకాలు, అర్చనలు ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయానికి బోధన్ ఏసీపీ కిరణ్కుమార్, రూరల్ సీఐ శ్రీనివాసరాజు దర్శనానికి రాగా.. వారిని ఆలయం తరఫున ఘనంగా సన్మానించారు. ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చేసిన ఏర్పాట్లపై ఏసీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎడపల్లి ఎస్సై విక్రం.. సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. ఆలయంలో కార్యక్రమాలను ఆలయ ఈవో గింజుపల్లి వేణు, జూనియర్ అసిస్టెంట్ రఘు కులకర్ణి, ధర్మకర్తలు పర్యవేక్షించారు.