Kamareddy | కామారెడ్డి : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఇంకా ఎంత సమయం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్పై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఇంకా ఎంత సమయం పడుతుందని, ఆరు గ్యారెంటీలకు సంబంధించిన సంతకం చేసి పత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనబడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడో సారి అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రూ.3 లక్షల 24 వేల కోట్ల బడ్జెట్ పెట్టిందని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను చట్టం చేసి అమలు చేస్తామని చెప్పి ఈ బడ్జెట్ లో కూడా చట్టబద్ధత తేలేదని అన్నారు.
రాష్ట్రంలో రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ వంద శాతం చేశామని, నిరూపిస్తే తాను ముక్కు నెలకు రాస్తా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిందని, రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పంటలకు పెట్టే సమయంలో కాకుండా పంటలు కోసేటప్పుడు ఇస్తుందని అన్నారు.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, ఎన్నికల సమయంలో దేవుళ్లపై ఒట్లు వేసి దేవుళ్లను సైతం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలపై ఈ రెండు రోజుల్లో పార్టీ తరపున అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ పూర్తిగా పేదలకు అన్యాయం చేసే విధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకటి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంభాల రవి యాదవ్ పాల్గొన్నారు.