నిజామాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాములపర్తి వెంకట నరసింహారావు సంక్షిప్తంగా పీవీ నరసింహారావుగా భారతీయులందరికీ సుపచితమైన భరతమాత ముద్దుబిడ్డ, తెలంగాణ వాసి. చిన్నస్థాయి నుంచి అత్యున్నతమైన పీఠాన్ని అధిరోహించి ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాంతాన్ని యావత్ దేశానికి పరిచయం చేసిన ఘనుడు. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి నుంచి దేశ ప్రధానిగా సేవలు అందించిన పీవీ.. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందారు. ముప్పై ఏండ్ల కిందట సరళీకరణ విధానాన్ని ప్రవేశ పెట్టడంతో భారతదేశ స్థితిని, గతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. ఆ మహానుభావుడికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం భారతరత్నను ప్రకటించింది. మరణానంతరం సరిగ్గా 20 ఏండ్ల తర్వాత ఈ పురస్కారం మన తెలుగు ఠీవీ.. పీవీకి దక్కడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆయనకు భారతరత్న అవార్డు కోసం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేసింది. శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడంతోపాటు పీవీ సేవలను స్మరించుకున్నది. ఈ నేపథ్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నర్సింహారావుతో ఉమ్మడి జిల్లాకు ఉన్న అనుబంధంపై ప్రత్యేక కథనం.
చారిత్రక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా వృథాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు ప్రధానమంత్రి హోదాలో పీవీ నర్సింహారావు అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1993, జూన్ 30న పీవీ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించి ప్రస్తుతం మండలంగా రూపాంతరం చెందిన ముప్కాల్ సమీపంలోనే వరద కాలువకు శంకుస్థాపన చేశారు. గోదావరి వరద నీటిని ప్రత్యేక కాలువ ద్వారా దిగువకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పంటల సాగుకోసం అందించే లక్ష్యంతో ఈ ప్రయత్నానికి పూనుకున్నారు. అనంతరం కొంతకాలం కాంగ్రెస్, తెలుగుదేశం పాలించగా, ఆంధ్ర పాలకులు వరద కాలువ ఊసెత్తలేదు. తాత్సారం చేస్తూ దశాబ్దంన్నర కాలంలో పూర్తి వరద కాలువ ట్రయల్ రన్ నోచుకునే సమయానికి ఎగువన మహారాష్ట్ర నిర్మించిన అక్రమ ప్రాజెక్టులతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బోసిపోయే దుస్థితికి చేరింది. తద్వారా పీవీ ఆశయం నీరుగారే పరిస్థితికి చేరింది. దీంతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా పీవీ శంకుస్థాపన చేసిన వరద కాలువకు కేసీఆర్ ప్రాణం పోశారు. కేసీఆర్ సర్కారు జల సంకల్పంతో దివంగత ప్రధాని పీవీ నర్సింహారావుకు ఘనమైన నివాళి అర్పించారు.
1983 నుంచి శ్రీరాంసాగర్కు వరదలు ప్రారంభమయ్యాయి. భారీగా వరదలు వచ్చిన ప్రతిసారీ మిగులు జలాలను ప్రాజెక్టుగేట్లను ఎత్తి గోదావరిలోకి వదిలేసేవారు. ఇలా వృథాగా పోతున్న జలాలను ప్రాజెక్టు దిగువన వినియోగించుకోవాలనే లక్ష్యంతో వరద కాలువ నిర్మించాలని ఆలోచించారు. అప్పుడే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని లక్షల మెట్ట భూములకు సాగునీటిని అందిచే లక్ష్యంతో వరద కాలువ నిర్మాణానికి బీజం పడింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలకేంద్రం సమీపంలోనే ఎస్సారెస్పీ జీరో పాయిట్ వద్ద ఇప్పుడు వరద కాలువ గేట్లు ఉన్న చోటనే ప్రధాని హోదాలో పీవీ వరద కాలువకు శంకుస్థాపన చేశారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిజామాబాద్ జిల్లాలో పీవీకి ఇదే తొలి పర్యటన కూడా. 1070 అడుగుల నీటి మట్టం వద్ద వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఆరు గేట్లతో నిర్మించారు. 22 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో వరద కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. 1074 అడుగుల నీటిమట్టం వరకు ప్రాజెక్టు నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేసుకునేలా, 122 కి.మీ. పొడవుతో కాలువను నిర్మించారు. ఇప్పుడిది మాజీ ప్రధాని ఇందిర పేరిట మనుగడలో ఉన్నది. పీవీ పేరును వరద కాలువకు పెడితే బాగుంటుందని చాలా మంది తెలంగాణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
2008లో ఉమ్మడి రాష్ర్టానికి సీఎంగా వై.ఎస్.రాజశేఖర్రెడ్డి కొనసాగుతున్నప్పుడు ఉమ్మడి జిల్లా పరిధిలోని కామారెడ్డి శివారులో శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం – తిరుపతి అనుబంధంగా క్షీర సాంకేతిక కళాశాలను మంజూరు చేశారు. దీనికి 2008 మార్చి ఒకటిన వైస్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మంత్రిగా ఉన్నప్పటికీ 2014 వరకూ ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. డెయిరీ టెక్నాలజీ కళాశాల భవనాన్ని నాటి వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పూర్తి చేయించారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత పీవీ స్మారకార్థం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పశు వైద్య, మత్స్య శాస్త్ర విశ్వవిద్యాలయానికి కేసీఆర్ ప్రభుత్వం చొరవ తీసుకొని పీవీ నర్సింహారావు పేరు పెట్టగా, యూనివర్సిటీ అనుబంధ కళాశాల ఆయన పేరిటే కొనసాగుతున్నది. ఈ విశ్వవిద్యాలయాన్ని 60 ఎకరాల కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల్లో ఏర్పాటుచేశారు. డెయిరీ టెక్నాలజీలో ప్రస్తుతం ఐదు రకాల కోర్సులు నిర్వహిస్తున్నారు. నాలుగు సంవత్సరాల బీటెక్లో భాగంగా డెయిరీ టెక్నాలజీ కోర్సును పీవీ నరసింహారావు పశువైద్య, మత్స్య శాస్త్ర విశ్వవిద్యాలయం అందిస్తున్నది.