ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా వానలు దంచికొడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడ చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ఇన్నాళ్లు బోసిపోయిన మంజీరా నది కొత్తనీటితో పరవళ్లు తొక్కుతున్నది. సోమ, మంగళవారాల్లో కురిసిన జడివాన పంటలకు ప్రాణం పోసింది. రైతాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చినుకు రాలడం ఆగకపోవడంతో మంగళవారం రోజంతా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రహదారులు బోసిపోయాయి. ఒకటి, రెండు చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచి పోయాయి. ఇటు శ్రీరాంసాగర్, అటు నిజాంసాగర్లోకి ఇన్ఫ్లో కొనసాగుతున్నది.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై18: జిల్లాలో సోమవారం రాత్రి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నది. మంగళవారం వానజోరు కొనసాగడంతో వాగులు, చెరువుల జలకళ సంతరించుకున్నాయి. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పెద్దవర్షం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సిరికొండ మండలంలో కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గడ్కోల్ వద్ద ఉన్న కప్పలవాగుపై చెక్ డ్యాం పొంగి ప్రవహిస్తున్నది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో మండల కేంద్రంలోని బొడ్డు మామిడి చెరువు జలకళ సంతరించుకుంది. ఎగువప్రాంతం నుంచి నీరు రావటంతో ఇందల్వాయిలోని పెద్దవాగు నిండుగా పారి చెరువులోకి నీరు చేరుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. వర్షం ఇలాగే కురిస్తే మరో రెండు రోజుల్లో అలుగు పారుతుందన్నారు. ఉమ్మడి కోటగిరి మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల పొలంలో నీటి నిల్వ ఉంది. సోయా, వరి పొలాలు నీట మునిగాయి. వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. కొత్తపల్లి గ్రామంలో రెండు ఇండ్లు కూలిపోగా.. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న, ఎంపీడీవో మనోహర్రెడ్డి పరిశీలించారు. పాత ఇండ్లలో ఉండొద్దని ఎంపీడీవో సూచించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువులోకి మాటు కాలువ ద్వారా భారీగా వరద వచ్చి చేరుతోంది.ధర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి స్థానిక నాయకులు, వీడీసీ సభ్యులతో కలిసి మంగళవారం మాటు కాలువను పరిశీలించారు. మాటు కాలువ కల్వర్టుల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు.జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి.
మోర్తాడ్ మండలంలో మంగళవారం సాయంత్రం వరకు 54.8 మి.మీల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ భావయ్య తెలిపారు. ధర్మోరా మొండివాగు నుంచి పెద్దవాగుకు వరద పోటెత్తడంతో పాలెం పెద్దవాగు చెక్డ్యాంపై నుంచి నీళ్లు పారుతున్నాయి. దొన్కల్ చెరువులన్నీ వరదకాలువ నీటితో నింపడంతో నిండుకుండలా మారాయి. శెట్పల్లి పెద్దచెరువు పూర్తిగా నిండిపోయింది. మాక్లూర్ మండలంలో చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షంనీరు వచ్చి చేరింది. నవీపేట మండలం జన్నేపల్లి, కమలాపూర్ చెరువులు నిండు కుండల్లా మారాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. పట్టణంలో 37.8 మిల్లీ లీటర్ల వర్షం కురిసినట్లు ఏఎస్వో ప్రశాంత్ తెలిపారు. బోధన్ పట్టణ శివారులోని పాండు చెరువు అలుగు పారుతున్నది. నర్సాపూర్ శివారులోని వాగులో నిండుగా పారుతున్నది. బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ తెలిపారు. బోధన్ మండలంలో పెద్దమావంది వద్ద పసుపు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. నందిపేట్ మండలంలోని చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతున్నది. రెంజల్ మండలంలోని కందకుర్తివద్ద గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతున్నది. మహార్రాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భారీగా నదిలోకి వరద వస్తున్నది. బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మంజీరా నదిలో కొత్త నీరు..
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సాలూరా వద్ద మంజీరా నదిలోకి కొత్త నీటి ప్రవాహం ప్రారంభమైంది. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రలోనూ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద వచ్చి చేరుతున్నది. దీంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మంజీరా నదికి ప్రధానంగా లెండి వాగు నుంచి వరద వస్తున్నది.