నిజామాబాద్ : 42.3 మి.మీ
కామారెడ్డి : 35.3 మి.మీ
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. సీజన్ మొదలైన నెలన్నర తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కురుస్తున్న వర్షానికి కాలువలు, ఒర్రెల్లో వరద ప్రవాహం మొదలైంది. పంట పొలాల్లోకి వరద చేరింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పెరుగుతున్నది. పలు గ్రామాల సమీపంలో రోడ్లపై నుంచి నీరు ప్రవహించింది. బోధన్ మండలంలోని పెద్దమావంది వద్ద పసుపు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వర్షంతో చెరువుల్లోకి కొత్తనీరు చేరుతున్నది. బోధన్ పట్టణ శివారులోని చెరువుల్లోకి వర్షపు నీరు చేరింది. పాండు చెరువు అలుగు పారుతున్నది.
నర్సాపూర్ శివారులోని వాగులో వర్షపునీరు ప్రవహిస్తున్నది. మోర్తాడ్ మండలంలోని చెరువులు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. ముసురు వర్షంతో ధర్మోరా మొండివాగు ద్వారా పెద్దవాగుకు నీరు రావడంతో పాలెం పెద్దవాగు చెక్డ్యాంపై నుంచి నీళ్లు పారుతున్నాయి. శెట్పల్లి పెద్దచెరువు పూర్తిగా నిండిపోయింది. సిరికొండ మండలంలోని గడ్కోల్ సమీపంలో ఉన్న కప్పలవాగు చెక్డ్యాం పొంగిపొర్లుతున్నది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురువడంతో సిరికొండలోని బొడ్డు మామిడి చెరువుల్లోకి నీరు చేరుతున్నది. గాంధారి మండల కేంద్రంలోని పెద్దవాగుతోపాటు పొతంగల్ వాగు, ముదెల్లి వాగు నిండుగా ప్రవహిస్తున్నాయి. బూర్గుల్ వాగుతోపాటు గుజ్జుల్ సమీపంలోని వాగు లోలెవల్ వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దకొడప్గల్ మండలం పోచారం తండా – పోచారం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తున్నది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి వరద ఉధృతి పెరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 18
ఎస్సారెస్పీలోకి 17,215 క్యూసెక్కుల ఇన్ఫ్లో
మెండోరా, జూలై 18: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. గోదావరి తీర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 17,215 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదన్నారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో మరో 2 టీఎంసీలు పెరిగే అవకాశమున్నదన్నారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ కాకతీయ నుంచి 50, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలకు 630 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 1070.90 అడుగులు (30.785 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నదని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 12.760 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ముప్కాల్ పంపుహౌస్ నుంచి కాళేశ్వరం నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు.
నిజాంసాగర్లోకి 813 క్యూసెక్కులు..
నిజాంసాగర్, జూలై 18: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 813 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివ తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1388.03 అడుగులు (3.30 టీఎసీలు) నీరు నిల్వ ఉన్నదని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 813 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు 146క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌలాస్ నాలా, సింగీతం, కళ్యాణి ప్రాజెక్టులకు స్వల్ప ఇన్ఫ్లో వస్తున్నది.
కామారెడ్డిలో 35.3 మి.మీ. వర్షపాతం నమోదు
కామారెడ్డి, జూలై 18: కామారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 35.3 మి.మీ వర్షపాతం నమోదైంది. మాచారెడ్డిలో అత్యధికంగా 60.0 మి.మీ, జుక్కల్లో అత్యల్పంగా 15.8 మి.మీ వర్షం కురిసింది.