మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి పర్యవేక్షణలో గురువారం 32 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 1,68,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని ఈఈ తెలిపారు. దీంతో దిగువకు వరద గేట్లతో 149,760 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. కాకతీయ కాలువకు 6వేలు, లక్ష్మి కాలువకు 150, సరస్వతీ కాలువకు 800, వరద కాలువకు 9,746క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని వెల్లడించారు.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు(90.313 టీంఎసీలు) కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.90 అడుగులు (89.763 టీఎంసీల) నీటినిల్వ ఉందన్నారు. ఈ సీజనులో ఇప్పటివరకు ప్రాజెక్ట్లోకి 318.503 టీఎంసీల వరద నీరు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.