ఖలీల్వాడి/ విద్యానగర్, జనవరి 3 : ఈ నెల 18 నుంచి చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతంచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల మం త్రులు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, ఇతర శాఖల అధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి మంత్రి ప్రశాంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఎంతో గొప్ప కార్యక్రమం కంటి వెలుగు అని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో కూడిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నూటికి నూరు శాతం విజయవంతం చేసేందుకు అంకితభావంతో కృషి చేస్తామని, ప్రజాప్రతినిధులు, అధికారులందరిని భాగస్వా మ్యం చేస్తామన్నారు. మొదటి విడుతలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం సందర్భంగా గిన్నిస్ రికార్డులో నమోదయ్యే తరహాలో ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో కోటీ 54 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 50 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేసి అరుదైన చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 18 నుంచి మలివిడుతగా ప్రా రంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని తదనుగుణంగా ముందుకెళ్తామని మంత్రి వేముల వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాల ఏర్పాటు
మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలు, హబిటేషన్ల వారీగా కంటి వెలుగు శిబిరాలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలన్నారు. ఇదివరకటితో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో మొత్తం 1500 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ రోజున ఏ వార్డులో, ఏ గ్రామపంచాయతీ పరిధిలో శిబిరాలు నిర్వహించాలనే విషయమై ముందస్తుగానే పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మంత్రుల నేతృత్వంలో జిల్లాస్థాయిలో ఈనెల 12 లోపు సన్నాహక సమావేశాలను ఖరారు చేసుకుని ఏర్పాట్లను సమీక్షించుకోవాలని సూచించారు. మున్సిపల్, మండల పరిషత్ స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించుకోవాలని, కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. శిబిరాల్లో కంటి పరీక్ష నిర్వహించిన అనంతరం అవసరమైన వారికి అదేరోజున రీడింగ్ గ్లాసెస్ అందించనున్నట్లు చెప్పారు. ప్రీస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి వాటి వివరాలను ఆన్లైన్ ద్వారా పంపిన మీదట పక్షం రోజుల్లోపు జిల్లాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు.
ప్రిస్క్రిప్షన్ అద్దాల బాక్స్లపై ప్రత్యేకంగా బార్ కోడ్ ముద్రిస్తున్నామని, దానిని స్కాన్ చేస్తే అవి ఎవరికి సంబంధించినవి అనేది పూర్తి చిరునామాతో తెలిసిపోతుందన్నారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయం త్రం 4 గంటల వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16533 శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని, వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 12768, పట్టణ ప్రాంతాల్లో 3788 శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇటీవలే కొత్తగా 927 మంది వైద్యుల నియామకం చేపట్టామన్నారు. వీసీలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు, పద్మ, వినీత, ప్రేమలత, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఏర్పాటు చేసిన వీసీలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో సాయగౌడ్, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్,అధికారులు పాల్గొన్నారు.