ఓటు అంటే మూడొద్దుల పండుగ కాదు.. ఐదేండ్ల మన భవిష్యత్తు. ప్రలోభాలకు లొంగి, మభ్యపెట్టే హామీలను నమ్మితే మోసపోతాం. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ గోసపడుతాం.. అదే బీఆర్ఎస్కు వేస్తే బాగు పడతామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం బోధన్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలు షకీల్, బిగాల గణేశ్గుప్తా, జీవన్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెప్పే మాటలు నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ మనల్ని ఎంత గోస పెట్టింది.. ఇప్పుడున్న బీజేపీ ఒక్క మంచి పని అన్న చేసిందా.. గరీబోళ్లను పట్టించుకుందా? అని ప్రశ్నించారు. ఓటు మన తలరాతని, భవిష్యత్తును నిర్ణయించేది. ఏ పార్టీ వాళ్లు చెప్పేది నిజం? ఎవరికి ఓటు వేస్తే మన భవిష్యత్తు బాగుంటుందో గుండెమీద చేయి వేసి ఆలోచించుకున్నాకే ఓటు వేయండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో ఎవరున్నారు? మీరు దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరున్నారు ? ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్కు ఓటు వేస్తే మనం బాధ పడుతాం. కేసీఆర్ను గెలిపిస్తే బాగుపడుతామన్నారు.
బోధన్/ ఖలీల్వాడి/ మాక్లూర్/ నందిపేట, నవంబర్ 18: కాంగ్రెస్ పాలన వస్తే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవని, ఒకనాడు రైతులు కరెంట్ కోసం ఎంతో గోస పడ్డారని, మళ్లీ ఆ కష్టాలు రాకూడదని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్తో గోసపడతామని, బీఆర్ఎస్తోనే భరోసా ఉంటుందని వివరించారు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. బోధన్ నియోజకవర్గం రెంజల్ మండలం సాటాపూర్లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా నిర్వహించిన రోడ్షోలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి మాక్లూర్ మండలం మానిక్బండార్, నందిపేట మండల కేంద్రాల్లో ఆర్మూర్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో పాల్గొన్నారు. ఆయా సభల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కొత్తకొత్త మ్యానిఫెస్టోతో వస్తోందన్నారు. కర్ణాటకలో తాము వస్తే ఐదు గ్యారెంటీలు ఇస్తామని రాహుల్గాంధీ హామీ ఇచ్చి రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.
కర్ణాటకలో నాలుగు గంటల కరెంట్ కూడా ఇవ్వడంలేదని, నాలుగు గంటల్లో 20నుంచి 30 సార్లు ట్రిప్ అవుతున్నదని, ఇలా కరెంట్ ఇస్తే.. మన దగ్గర రైతులు బతుకుతారా.. అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు పారుతాయని అంటున్నాడని, 3 గంటల కరెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో కరెంట్తోపాటు రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నామన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయని, పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్కు ఓటేసి కర్ణాటక లెక్క ఆగమాగం కావొద్దని ఆయన ఓటర్లకు హితవుపలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పింఛన్లను రూ.2000లకు పెంచిందని, మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5000 వరకు పెంచుతామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్.. ఇలా ఎన్నో పథకాలు అమలు చేశామని, మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే మహిళలకు రూ.3వేలు ఇచ్చే సౌభాగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామన్నారు.
కేసీఆర్ అంటే ఒక నమ్మకమని, ప్రజలకు కేసీఆర్పై విశ్వాసమున్నదని, ప్రతి ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలుచేశారని హరీశ్ రావు అన్నారు. ఓట్ల కోసం, ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త హామీలతో ఝాటా మ్యానిఫెస్టో తీసుకొస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఏదిపడితే అది రాసుకుపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆ మ్యానిఫెస్టోను నమ్మితే.. కర్ణాటక ప్రజలకు పట్టిన గతే మనకు పడుతుందన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ముస్లింల పేదరికానికి 60ఏండ్ల కాంగ్రెస్ పాలనే కారణమని, కాంగ్రెస్ పాలనలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ఎలాంటి కృషీ జరగలేదని హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ ఒక సెక్యులర్ లీడరని, కేసీఆర్ పాలనలో ఎక్కడా మతకలహాలు జరగలేదని అన్నారు.
కరోనా విపత్కర సమయంలో ప్రజల వెన్నంటే ఉన్న వ్యక్తి బిగాల గణేశ్ గుప్తానేనని, గల్లీగల్లీకి తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పారని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. ప్రజల కష్టసుఖాల్లో ఉన్న వ్యక్తి బిగాల గణేశ్ గుప్తానేనని, అన్నం పెట్టి కడుపులో పెట్టుకొని చూసుకున్నారన్నారు. ఒకప్పటి నిజామాబాద్కు, ఇప్పటికీ ఎంతో తేడా ఉన్నదని, రోడ్లు, పార్కులు, వైకుంఠధామాలు, సర్కారు దవాఖానలో మెరుగైన వైద్యం అందేలా కృషి చేశారన్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలని, బిగాల గణేశ్గుప్తా, సీఎం కేసీఆర్లను గెలిపిస్తే మనం బాగు పడుతామని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మనం బాధపడుతామన్నారు. 30న కారు గుర్తుకు ఓటు వేసి బిగాల గణేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని, మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
‘బోధన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సుదర్శన్రెడ్డి గతంలో నీళ్ల మంత్రిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి తాగునీరు అందించలేదు.. సాగు నీరు కూడా ఇవ్వలేదు.. ఆనాడు నిజాంసాగర్ ఆయకట్టు చివరికి భూములకు నీళ్లు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది.. మీ ఎమ్మెల్యే షకీల్ నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి వందల కోట్ల నిధులు తీసుకువచ్చి ఆ కాల్వలను బాగుచేయించిండు..’ అని మంత్రి హరీ శ్ రావు అన్నారు. బోధన్ – నిజామాబాద్ రోడ్డును రూ.30 కోట్లతో విస్తరింపజేశామని అన్నారు. నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని రూ.6.5 కోట్లతో నిర్మించామని తెలిపారు. బాసర రోడ్డును రూ.55 కోట్లతో నాలుగులేన్లుగా విస్తరింపజేశామన్నారు. షకీల్కు వచ్చే సర్కార్లో పెద్ద పదవి రావాలంటే ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు.
ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న తనను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఓటర్లను కోరారు. మరోసారి కేసీఆర్ను సీఎంగా చూడాలని ఆయన చెప్పారు.
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో మూడోసారి జీవన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీశ్రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వస్తే గోస పడుతం, బీఆర్ఎస్ వస్తే బాగు పడుతామని, తొమ్మిదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. జీవన్రెడ్డి సీఎం కేసీఆర్కు నమ్మిన బంటు అని, మరోసారి గెలిస్తే ప్రమోషన్ వస్తుందని, భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీవన్రెడ్డికి పోటీగా నిలిచిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు డిపాజిట్లు రాకుండా చూడాలని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఓర్వలేకనే జీవన్రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఎప్పుడూ పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలు, రైతుల శ్రేయస్సు కోసం ఆలోచిస్తారని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ప్రజల బాగుకోసమే ఎన్నో పథకాలను రూపొందించి విజయవంతంగా అమలు చేశారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని పథకాలు అమలుకానున్నాయని, వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.