కామారెడ్డి, జనవరి 12 : హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం సాధించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం హరితహారం కార్యక్రమంపై జిల్లా అటవీ శాఖాధికారి వికాస్ మీనాతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2024-25 వార్షిక సంవత్సరాల్లో వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటేందుకు లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలన్నారు.
2024లో 26లక్షల 40 వేల లక్ష్యం నిర్దేశించుకున్నామని, 2025లో 17 లక్షల 92 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. 2026 నాటికి మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, పశు సంవర్ధక శాఖ అధికారి సింహారావు, బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, కార్మిక శాఖ సహాయ కమిషనర్ సురేందర్ కుమార్, మెప్మా పీడీ శ్రీధర్, ఆబ్కారీ, మున్సిపల్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.