నందిపేట్, డిసెంబర్ 6: ఆర్మూర్లోని ప్రభుత్వ దవాఖాన నిర్వహణ బాగున్నదని, ఎమ్మెల్యే జీవన్రెడ్డి చొరవతో 100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ అయ్యిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానను మంత్రి హరీశ్రావు మంగళవారం తనిఖీ చేశారు. దవాఖాన నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర పనులపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న రోగులు, గర్భిణులతో మాట్లాడి దవాఖానలో అందిస్తున్న భోజన ప్రణాళిక గురించి అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో ఫార్మసిస్ట్ ల్యాబ్ సౌకర్యాలపై తెలుసుకొని హై అండ్ అల్ట్రా సౌండ్ మిషన్ ఉన్నప్పటికీ టిఫా స్కానిం గ్ మిషన్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిస్ కోసం నిజామాబాద్కు వెళ్లాల్సి వస్తున్నదని ఎమ్మెల్యే జీవన్రెడ్డి మంత్రి దృష్టికి తీసుకవచ్చారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి 10 రోజుల్లో ఏరియా దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు వైద్యులు, సిబ్బందితో సమీక్షించి దవాఖానకు కావాల్సిన తక్షణ సౌకర్యాలపై చర్చించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రభుత్వ దవాఖానకు తొలి ప్రాధాన్యతనిస్తూ అత్యాధునిక సాంకేతిక వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దవాఖానలో మందుల కొరత లేదని, బయట ప్రైవేట్ దుకాణాలకెళ్లి కొనాల్సిన పరిస్థితి లేదన్నారు. అతి త్వరలో దవాఖానలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తామని హామీనిచ్చారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధను దృష్టిలో పెట్టుకొని దవాఖానలో మరిన్ని అత్యాధునిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు.
సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలనే చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. ఇప్పటికే 22,670 ఉచిత ప్రసవాలు జరగడం అభినందనీయమన్నారు. ఒక్క నవంబర్లోనే 310 డెలివరీలు జరిగి ఆ తల్లుల కుటుంబాలకు దాదాపు కోటిన్నర రూపాయలు ఆదా కావడం హర్షణీయమన్నారు. ఇక నుంచి నెలకు 500 ఫ్రీ డెలివరీలు జరిగేలా కృషి చేయాలని లక్ష్యాన్ని విధించారు. ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో పలు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మంత్రి హరీశ్రావుకు ఎమ్మెల్యే జీవన్రెడ్డి వినతిపత్రం అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ వీజీగౌడ్, సీనియర్ నాయకుడు డాక్టర్ మధుశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితాపవన్, వైస్చైర్మన్ షేక్ మున్నా, వైద్యులు నాగరాజు, అమృత్రెడ్డి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్లోని ఆయన విగ్రహానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.