సకల జనుల ‘సంక్షేమమే’ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బడ్జెట్ను రూపొందించింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మేళవింపు చేసుకుంటూ, సబ్బండ వర్గాలకు సమన్యాయం చేస్తూ భారీగా నిధులు కేటాయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూపొందించిన బడ్జెట్ను సోమవారం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు, మండలిలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రవేశపెట్టారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకూ బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో సతాయిస్తున్నా.. కేసీఆర్ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మూడో వంతు సంక్షేమ రంగానికే కేటాయించడం విశేషం. వ్యవసాయ, సాగునీటి రంగాలకూ సింహభాగం నిధులు కేటాయించారు. ఇవేకాక ప్రత్యేకంగా రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలకు రూ.23 వేల కోట్లు ప్రతిపాదించారు. తద్వారా వ్యవసాయంపై ఆధారపడిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు భారీగానే లబ్ధి చేకూరనున్నది. మొత్తంగా రాష్ట్ర బడ్జెట్పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. రైతులు, సామాన్యులు, మేధావులు, ఉద్యోగ వర్గాలు, వాణిజ్య, వ్యాపార వేత్తలు ప్రాధాన్యతాపరంగా చేసిన కేటాయింపులపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– నిజామాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సకల జనులు హర్షం వ్యక్తంచేశారు. శాసనసభ, శాసనమండలిలో సోమవారం మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ, సాగునీటి రంగాలకు పెద్దపీట వేస్తూ రుణమాఫీకి సైతం నిధులు కేటాయించడంతో రైతన్నలు సంబురపడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కడుతూ సబ్బండవర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉన్నదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. పల్లె, పట్టణాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని పేర్కొంటున్నారు. విద్యా, వైద్యానికి భారీగా నిధులు కేటాయించడంపై విద్యావేత్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పేదలు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి నిధులు కేటాయించడంతో సొంతింటి కల సాకారమవుతుందని చెప్పారు. బడ్జెట్ ప్రసంగాన్ని టీవీల్లో చూసిన పలువురు.. నమస్తే తెలంగాణతో పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే…
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కక్ష, వివక్షను ప్రదర్శిస్తున్నా, అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నా సంక్షేమం, అభివృద్ధిలో ఏనాడూ కొరత రానివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను కాపాడుతున్నది. దేశంలో ప్రతిఘాతుక శక్తులు సామాజిక సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో తెలంగాణ గంగా జమునా తెహజీబ్ను పరిరక్షిస్తూ, శాంతి, సామరస్యాలను కంటికి రెప్పలా కాపాడుతున్నది. ఎవరెన్ని కుట్రలు చేసినా మా మనోబలం గానీ, మాకున్న ప్రజాబలం గానీ చెక్కుచెదరదు.
– బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్రావు
అనేక సవాళ్లు, అవరోధాల నడుమ తెలంగాణ ప్రగతి ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నది. ఎనిమిదిన్నరేండ్ల తక్కువ వ్యవధిలోనే అనేక విజయాలను సాధించింది. దేశం అబ్బురపడే అద్భుతాలను ఆవిష్కరించింది. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని, అభివృద్ధికి మానవీయ కోణాన్ని అద్దింది. తెలంగాణ అభివృద్ధి నమూనాకు దేశం మొత్తం జేజేలు పలుకుతున్నది.
– బడ్జెట్ ప్రసంగంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
బడ్జెట్ జనరంజకంగా ఉంది..
బాన్సువాడ, ఫిబ్రవరి 6:అన్నివర్గాలకు న్యాయం చేకూరేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. మున్సిపాలిటీ శాఖకు 11వేల కోట్ల పైచిలుకు నిధులు కేటాయించడంతో మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి సాధిస్తాయి. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేయడం చాలా ఆనందంగా ఉన్నది. నిరుద్యోగులకు మంచి అవకాశం.
– బెజుగాం భాస్కర్ గుప్తా, బాన్సువాడ
చరిత్రలోనే పెద్ద బడ్జెట్
బోధన్, ఫిబ్రవరి 6: రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద బడ్జెట్. ప్రతి ఏటా బడ్జెట్ పెరుగుతూ రావడం సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబిస్తున్నది. 2023-24 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపుల విలువ రూ.2,90,326 కోట్లు కావడం అందరికీ గర్వకారణం..
– టి.ఇంద్రకరణ్, న్యాయవాది, బోధన్
రైతు పక్షపాతి..కేసీఆర్
గాంధారి, ఫిబ్రవరి 6: రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం సంతోషకరమైన విషయం. రైతుబంధు, రైతుబీమాతోపాటు పంట రుణాల మాఫీ కోసం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. దీంతో మరోసారి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారు.
– జింగురు సురేశ్, గాంధారి
దళితుల అభ్యున్నతికి కృషి
మోర్తాడ్, ఫిబ్రవరి 6: రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుందని బడ్జెట్లో దళితబంధుకు రూ.17,700కోట్లు కేటాయించడంతో స్పష్టమైంది. దళితబంధు పథకం ప్రవేశపెట్టడమే ఊహించలేనిది. ఇప్పటికే దళితబంధు ద్వారా మేము లబ్ధిపొంది ఆర్థికంగా ఎదుగుతున్నాం. బడ్జెట్లో పెద్ద మొత్తంలో దళితబంధుకు కేటాయించడం సంతోషకరం.
-పత్రి భాస్కర్, దోన్పాల్
పల్లె, పట్టణ ప్రగతికి పెద్దపీట..
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 6: రాష్ట్ర బడ్జెట్లో పల్లె, పట్టణ ప్రగతికి పెద్దపీట వేశారు. రూ.4,834 కోట్లు పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి కేటాయింపులు జరిపి పల్లె, పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నది. దేశంలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే తొలి 19 గ్రామా లు తెలంగాణలోనివే కావడం ప్రభు త్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
– గడ్డం స్వామి, సర్పంచ్, కమ్మర్పల్లి
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
బాల్కొండ, ఫిబ్రవరి 6: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం చాలా సంతోషకరం. ఇలాంటి పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల పెండ్లికి మేనమామలాగా రూ.1,00,116/-లు ఇవ్వడం బాగున్నది. నేను కూడా నా కూతురు పెండ్లి చేశాను. కల్యాణలక్ష్మి ద్వారా రూ.1,00,116/-లు అందాయి. సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
-ద్యావతి భూలక్ష్మి, బాల్కొండ
రుణమాఫీ సంతోషకరం..
బాన్సువాడ, ఫిబ్రవరి 6: రైతు రుణమాఫీకి రూ.6,300 కోట్లు కేటాయించడం సంతోషకరం. ఎన్నో రోజులుగా రైతులు రుణాల మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ మాటిస్తే తప్పే నాయకుడు కాదు. రైతులకు అవసరమైన మంచి పథకాలు పెట్టారు. విద్యుత్, రుణమాఫీ, వ్యవసాయానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించి మంచి ఆలోచన చేశారు.
– జైపాల్ యాదవ్, కొల్లూర్
బడ్జెట్లో రైతులకు దక్కిన గౌరవం
నిజాంసాగర్, ఫిబ్రవరి 6: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు మరోమారు గౌరవం దక్కింది. ప్రభుత్వం రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు ఆయిల్పామ్ సాగు కోసం వెయ్యి కోట్లు కేటాయించింది. రైతుబంధు, రైతుబీమా, నీటిపారుదలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ప్రతి బడ్జెట్లో రైతులకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ రైతు బాంధవుడిగా మారారు.
– బేగరి రాజు, రైతు, బంజపల్లి,నిజాంసాగర్
దళితులపై కేసీఆర్ ప్రేమకు ఈ బడ్జెట్ నిదర్శనం
బోధన్, ఫిబ్రవరి 6: దళితులపై సీఎం కేసీఆర్ మొదటి నుంచి ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఎస్సీల సంక్షేమం కోసం రూ.21,022 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. ఎస్సీ సంక్షేమ శాఖకు కేటాయించిన బడ్జెట్లో రూ.17,000 కోట్లు దళితబంధుకు కేటాయించడం హర్షణీయం. సీఎం కేసీఆర్కు మా దళితుల తరఫున కృతజ్ఞతలు.
– ఎం.విద్యాసాగర్, దళిత సంఘాల నాయకుడు, బోధన్
రైతులపాలిట దేవుడు.. కేసీఆర్
ఏర్గట్ల, ఫిబ్రవరి 6: రైతు సంక్షేమం కోసం పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి సీఎం కేసీఆర్ దేవుడని మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి రైతులకు 24గంటల ఉచిత విద్యుత్తోపాటు, రైతుబంధు, రైతుబీమా మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. రైతులందరం ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటాం.
– బద్దం హన్మాండ్లు, రైతు, ఏర్గట్ల
రైతులను కడుపులో పెట్టుకొని చూస్తుండు..
ఆర్మూర్,ఫిబ్రవరి 6: రైతులకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం శుభపరిణామం. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీకి కేటాయించిన బడ్జెట్తో రైతులు రాజులవుతారు. గ్రామ పంచాయతీలకు నిధులను ఇవ్వడం సంతోషకరం. బడ్జెట్ కేటాయింపుతో రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో కేసీఆర్ రైతుల గుండెల్లో నిలిచిపోయారు.
-ఆసపురం శ్రీనివాస్రెడ్డి, రైతు ,పిప్రి
ఈహెచ్ఎస్ నిర్ణయం బాగుంది..
ఖలీల్వాడి, ఫిబ్రవరి 6:ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు కోసం బడ్జెట్లో రూ.7289కోట్లు కేటాయించడం హర్షణీయం. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం కొత్తగా ఈహెచ్ఎస్ విధానం ప్రవేశపెడతామని చెప్పడం సంతోషకరం. ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్టు ఏర్పాటు నిర్ణయం బాగున్నది.
– మాడవేటి వినోద్కుమార్, బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు
దళితుల అభ్యున్నతికి కృషి
ఖలీల్వాడి,రాష్ట్ర బడ్జెట్లో దళితబంధు పథకం కోసం రూ.17700 కోట్లు కేటాయించడం అభినందనీయం. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారనడానికి నిదర్శనం. దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– ఎడ్ల నాగరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాల మహానాడు
మాకు భరోసా ఇస్తుండు..
తెలంగాణ అచ్చినంక రూ.200 ఉన్న పింఛన్ని కేసీఆర్ సారు 2016 రూపాయలు చేసి మాయసుంటి ముసలోళ్లకు అండగా ఉంటుండు. ఇయ్యాళ్ల మన బడ్జెట్లో పింఛన్ల కోసం 1200 కోట్లు కేటాయించిన కేసీఆర్ సారు మా బతుకులకు భరోసా ఇస్తుండు. నా ఇల్లు గడువాలన్నా ఆసరా రావాల్సిందే..
– చాట్ల అన్నపూర్ణ, ముప్కాల్
రుణమాఫీ హర్షణీయం
మాక్లూర్, ఫిబ్రవరి 6: బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం నిధులు కేటాయించడం హర్షణీయం. 90వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయడంతో ఎంతో మేలు జరుగుతుంది. రైతుబంధు, ఉచిత విద్యుత్, రైతుబీమా తదితర పథకాలతో సీఎం కేసీఆర్ రైతులకు మేలు చేస్తున్నారు. తాజాగా రుణమాఫీ ప్రకటనతో రైతులందరం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– న్యాలకంటి భోజన్న, రైతు, ముల్లంగి(బి)
సొంతింటికల నెరవేర్చిన సీఎం కేసీఆర్..
భీమ్గల్, ఫిబ్రవరి 6: సొంత జాగ ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు ఇస్తామని బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. కొత్తగా రోడ్లు నిర్మించేందుకు కూడా నిధులు మంజూరు చేయడం సంతోషకరం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాలకు అద్భుతమైన తారు రోడ్లు వేశారు.
– పర్రె ప్రసాద్, వ్యాపారస్తుడు, భీమ్గల్