పెద్ద కొడప్గల్, నవంబర్ 4: ‘ఆశీర్వదించండి.. స్థానికంగా ఉంటూ ప్రజా సేవకుడిగా పనిచేస్తా..’ అని బీఆర్ఎస్ జుక్కల్ నియోజకవర్గ అభ్యర్థి హన్మంత్ షిండే అన్నారు. మండలంలోని చిన్న దేవీసింగ్ తండా, టీకారం తండా, బూర్గుపల్లి, సముందర్ తండా, చావుని తండా, తలాబ్ తండా, శివ్వాపూర్, అంజని, పెద్ద కొడప్గల్ గ్రామాల్లో ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా తండాలు, గ్రామల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి సత్కరించారు. మహిళలు తిలకం దిద్ది, మంగళహారతులతో స్వాగతం పలికారు. తెలంగాణ ఏర్పడ్డాక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. అన్ని గ్రామాల్లో పంచాయతీ భవనాలను నిర్మించుకున్నామని తెలిపారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు భవనాలను నిర్మిస్తామన్నారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వడ్లం, బూర్గుపల్లి, చావుని తండా, తలాబ్ తండా, శివ్వాపూర్ తదితర గ్రామాలకు సాగు నీరు అందిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, పేదల కష్టాలు తీర్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పెద్దకొడప్గల్ మండలంగా ఏర్పడిందని గుర్తుచేశారు. ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టో అద్బుతంగా ఉందన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు సౌభాగ్యలక్ష్మి అందిస్తామని, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవొద్దని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ దేశాయ్, ఎంపీటీసీ జానాబాయి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు తిర్మల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఖండేరావు, సీనియర్ నాయకుడు సతీశ్ యాదవ్, మండల కో- ఆప్షన్ సభ్యులు జషార్ షా తదితరులు పాల్గొన్నారు.