కమ్మర్పల్లి/ఆర్మూర్/ముప్కాల్ /ఏర్గట్ల/నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 24 : కమ్మర్పల్లి మండలంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నువ్వు పంట నేల వాలింది. ఉప్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏకలవ్య నగర్లో ప్రధాన రోడ్డుపై చెట్టు విరిగి పడడంతో జీపీ కార్మికులు తొలగించారు. ఆర్మూర్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. సిద్దులగట్ట వెనుక భాగంలో, ఆలూర్ బైపాస్ రోడ్డుతో పాటు పెర్కిట్ శివారులో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసింది. ముప్కాల్ మండలంలోని నాగంపేట్ గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగిపడింది.
ఇండ్ల పైకప్పులు గాల్లోకి ఎగిరిపడ్డాయి. ఏర్గట్ల మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కురిసింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని శ్రీనగర్, తిర్మన్పల్లి గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. కోతకు వచ్చిన వరి నేల రాలింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీనగర్ సర్పంచ్ సురేందర్రెడ్డి తన సొంత పొలంతో పాటు మరో 20 ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. వడగండ్ల వానతో ధాన్యం నేల రాలిపోయి తీవ్ర నష్టం ఏర్పడిందని వాపోయాడు.