కామారెడ్డి, జూన్ 2 (నమస్తే తెలంగాణ)/ఖలీల్వాడి: ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. కామారెడ్డి కలెక్టరేట్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజామాబాద్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ప్రశాంత్రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా జిల్లాల్లో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని స్పీకర్, మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో సబ్బండ వర్ణాలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయా జిల్లాల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రదర్శనలుముగిసిన అనంతరం చిన్నారులను మంత్రి, స్పీకర్ అభినందించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.
అంతకుముందు ఆయా జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అమర వీరుల స్తూపం వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలు, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాల్లో యావత్ దేశానికి దిక్సూచిగా నిలవడం గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్లో అమరుల కుటుంబాలను మంత్రి ప్రశాంత్రెడ్డి ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని వారికి భరోసా కల్పించారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో మంత్రితోపాటు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, ట్రైనీ అదనపు కలెక్టర్ కిరణ్మయి, అదనపు సీపీ గిరిరాజా, డీఎఫ్వో వికాస్ మీనా, నగర మేయర్ దండు నీతూకిరణ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్ దఫేదార్ శోభారాజు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్ దోత్రే, చంద్రమోహన్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందూప్రియ, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.