నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 27: ఆరు గ్యారెంటీల అమలు కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నేటి(గురువారం) నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. అన్ని గ్రామాలతోపాటు మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఒక గ్రామం, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరో గ్రామంలో సభను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.
ఈ మేరకు ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు బుధవారం సిబ్బందితో సమావేశాలు నిర్వహించి గ్రామ సభలు, దరఖాస్తుల నిర్వహణపై వారికి అవగాహన కల్పించారు. దరఖాస్తు ఫారంతోపాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్ జిరాక్స్ ప్రతులను తప్పని సరిగా జత చేయాలని సూచించారు. దరఖాస్తులను ప్రతి రోజూ ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గాంధారిలో తహసీల్దార్ జానకీ, ఎంపీడీవో సతీశ్ ఆధ్వర్యంలో, పిట్లంలో ఎంపీడీవో వెంకటేశ్వర్, తహసీల్దార్ రామ్మోహన్రావు, రామారెడ్డిలో ఎంపీడీవో సవితారెడ్డి, జడ్పీటీసీ మోహన్రెడ్డి, సదాశివనగర్లో ఎంపీడీవో లక్ష్మి, తహసీల్దార్ హిమబిందు, ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నర్సింహులు, బిచ్కుందలో డీఎల్పీవో శ్రీనివాస్ ప్రజాపాలనపై అవగాహన కల్పించారు. కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, బాన్సువాడలో ఆర్డీవో భుజంగరావు, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీపీ నీరజ ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేశ్ ఆధ్వర్యంలో సమావేశాలు కొనసాగాయి. ఉమ్మడి మాచారెడ్డి మండలంలో డీఎల్పీవో సాయిబాబా, ఎంపీడీవో బాలకృష్ణ, తహసీల్దార్లు శ్వేత, జయంత్రెడ్డి, దోమకొండలో ఎంపీపీ శారద, జడ్పీటీసీ తిర్మల్ గౌడ్, తహసీల్దార్ సంజీవరావు, ఎంపీడీవో చిన్నారెడ్డి అవగాహన కల్పించారు. బీబీపేట్లో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, ఎంపీపీ బాలామణి, ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, నస్రుల్లాబాద్లో ఎంపీపీ విఠల్ తహసీల్దార్ రాజు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, రాజంపేట్లో ఎంపీడీవో బాలకిషన్ తహసీల్దార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.