కంఠేశ్వర్, మార్చి 26: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు వారి నిర్లక్ష్యమంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు నిజామాబాద్ అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ వెల్లడించారు. సంబంధిత అధికారులు, సిబ్బందితో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
కామారెడ్డి, మార్చి 26: యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులతో మంగళవారం మాట్లాడారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 347 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పొరుగు రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా గట్టి నిఘా పెడుతున్నామని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.