కామారెడ్డి, జూన్ 19 : డబుల్ బెడ్ రూం ఇండ్లపై మాజీ మంత్రి షబ్బీర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచించారు. ప్రజలు నాలుగు సార్లు ఓడించినా ఆయనకు సిగ్గురాలేదని మండిపడ్డారు. సోమవారం ప్రభుత్వ విప్ జిల్లాకేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గానికి మొత్తం 1715 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 760 డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో 320, మున్సిపల్ పరిధిలోని రామేశ్వరపల్లి లో 220, ఇల్చిపురంలో 50, టేక్రియాల్లో 50, దేవునిపల్లిలో 120 ..మొత్తం 760 ఇండ్లు మంజూరైనట్లు వివరించారు. రామేశ్వరపల్లిలో రంగులు వేయాల్సి ఉందని, పదిరోజుల్లో పూర్తిచేస్తామన్నారు. సోమవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ టేక్రియాల్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లలో నాణ్యత లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇండ్లు 50 ఏండ్ల వరకు ఉంటాయని ఇటీవల తాను సవాల్ విసిరానని గుర్తుచేశారు. ఇప్పుటికిప్పుడు రావాలని పత్రికా ముఖంగా ఆయన సవాల్ విసరడం విడ్డూరమన్నారు. తాను ఆయనలా పనీ పాట లేకుండా లేనని, ఎమ్మెల్యే పదవిలో ఉన్నానని అన్నారు.
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 22 వరకు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. తన సవాల్ స్వీకరించాలంటే ఈ నెల 22 తర్వాత తేదీ ఇవ్వాలని.. అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు. గతంలో 2018 లో ఆస్తుల విషయంలో కామారెడ్డి గంజ్లో సవాల్ విసిరినప్పుడు రాకుండా తప్పించుకున్నాడని అన్నారు. కామారెడ్డి ప్రజలు షబ్బీర్ అలీని నాలుగుసారు ఓడించినా సిగ్గు రాలేదని అన్నారు. పదేండ్లు మంత్రిగా పని చేసిన ఆయన ఇండ్ల నాణ్యత చూడాలంటే ఇంజినీర్లను తీసుకెళ్లాలని, మేస్త్రీలను తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు.
ఇండ్లను బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్నావని, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చామని తెలిపారు. దీనికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాటు లేకుండా కలెక్టర్, అధికారులు, గ్రామస్తుల సమక్షంలో డ్రా తీశామని అన్నారు. పార్టీ అధిష్టానాన్ని నమ్మించాలనే ఉద్దేశంతో తన పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. తనకు టికెట్ దక్కదనే ఇలాంటి నీచ రాజకీయాలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన నిజాయితీని వేలుపెట్టి చూపించే హక్కు లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో 30 శాతం కమీషన్ తీసుకున్నానని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల కాళ్లు మొక్కి గెలవాలి తప్ప ఇలాంటి నీచ రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్ పాల్గొన్నారు.