కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు.
కామారెడ్డి నియోజికవర్గంలోని దోమకొండ, బీబీపేట్, బిక్కనూర్, కామారెడ్డి, రాజంపేట, రామారెడ్డి, మాచారెడ్డి మండలాలకు చెందిన 364 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారాక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 7,666 మందికి 76 కోట్ల 35 లక్షల 56 వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. దేశానికి 8 ఏండ్లుగా ప్రధానిగా, గుజరాత్ రాష్ట్రానికి 15 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమ పథకాలు లేవని ఆయన గుర్తు చేశారు.