పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్నది. కామారెడ్డి పట్టణంలో ఆదివారం నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, సిరికొండలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు పంపిణీ చేయడంతో పాటు రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తుండడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కామారెడ్డి, జూలై 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికే పోడు పట్టాలను గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని కేవీఆర్ గార్డెన్లో నియోజకవర్గంలోని మాచారెడ్డి, రామారెడ్డి మండలాలకు చెందిన 668 మంది గిరిజనులకు 1,668 ఎకరాల పోడు భూముల పట్టాలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశంలో గిరిజనులను ఎందుకు గుర్తించలేదన్నారు. గిరిజనులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాడుకున్నారని అన్నారు. వారి సంక్షేమం గురించి ఎవరూ ఆలోచించలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం వచ్చింది అని ప్రశ్నించేవారికి తెలిసేలా.. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారన్నారు. వారే పాలించుకునేలా గౌరవం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. గిరిజనులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం లభించిందని అన్నా రు. తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో తండాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని తెలిపారు. తాను నియోజకవర్గంలోని అన్ని తండాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.20లక్షల చొప్పున నిధులు మం జూరు చేయించినట్లు వివరించారు. సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కేవలం 3లక్షల పట్టాలు ఇస్తే.. స్వరాష్ట్రంలో 4 లక్షల 6వేల ఎకరాల పోడు భూమి పట్టాలను ఇచ్చారని చెప్పారు. వీటితో పాటు రైతుబంధు, రైతుబీమా సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
గిరిజనులకు పోడు భూముల పట్టాలను ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పంటలను సాగు చేస్తున్నా, పట్టాలు లేక తరచుగా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, సర్కారు కృషితో సమస్యకు పరిష్కారం లభించిందని సంబురపడుతున్నారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తోందన్నారు. వందల ఏండ్లుగా గిరిజనులు అటవీ సంపదను కాపాడుకొంటూ వచ్చారని తెలిపారు. ప్రభుత్వం అర్హత గల గిరిజనులకు పోడు భూములను పంపిణీ చేసిందన్నారు. గిరిజనులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, ఎంపీపీ నర్సింగ్రావు, జడ్పీటీసీ రామ్రెడ్డి, రామారెడ్డి ఎంపీపీ దశరథ్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గిరిజనులకు పోడు భూమి పట్టాలు ఇప్పిస్తామని కొందరు దళారులు గిరిజనుల వద్ద రూ.5వేల నుంచి 10వేల వరకు వసూలు చేస్తున్నారని, ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా పట్టాలను పంపిణీ చేస్తోందన్నారు. అనవసరంగా మోసపోవద్దని సూచించారు. నియోజకవర్గంలో మరో 400 మంది అర్హులైన గిరిజనులు పంటలను సాగు చేస్తున్నారని సమాచారం ఉందని, మరోసారి సర్వే చేయించి పట్టాలు అందేలా కృషి చేస్తామన్నారు.
ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న మాకు సీఎం కేసీఆర్సారు పోడుభూములకు పట్టాలు ఇచ్చి మా కుంటుంబాల్లో వెలుగులు నింపిండు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సార్లకు రుణపడి ఉంటాం. పట్టాలతోపాటు రైతుబంధు కూడా ఇవ్వాలని సీఎం చెప్పడం మా కుటుంబాలకు వరం. కేసీఆర్ సార్కు ప్రజల దీవెనలు ఎప్పడూ ఉంటాయి.
-నేనావత్ లక్ష్మి, జక్కల్దాని తండా, బాన్సువాడ మండలం
మాకు పోడు పట్టాలు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సారుకు ధన్యవాదాలు. మేము ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కున్నం. పంటలు వేసినంక దున్నేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులకు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టాలు ఇవ్వడంతో మాకు ఎంతో లాభం చేకూరింది.
-బానోత్ రాజి, అంకిరెడ్డి పల్లి తండా
కేసీఆర్ కృషితోనే గిరిజన రైతులకు పోడు పట్టాలు అందాయి. సీఎం కేసీఆర్కు రూరల్ గిరిజన బాధలు తెలుసు. ఎన్నో ఏండ్లుగా కబ్జాలో ఉన్న మా భూములకు పట్టాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. పట్టాలు అందించినందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు.
-బదావత్ లలిత, రంజిత్నాయక్తండా, ఇందల్వాయి మండలం
ఎన్నో ఏండ్లుగా భూమిని నమ్ముకొని పంట పండిస్తున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. చాలాసార్లు అధికారులతో పోరాటం చేశాం. ఈ సమ స్య పరిష్కారం ఎలా లభిస్తుందోనని ఆందోళన చెందాం. సీఎం కేసీఆర్ గిరిజనులకు పట్టాలు ఇచ్చి మా భయాలన్నింటినీ తొలగించారు.
-బాదావత్ మాలి, కొత్తకొరుట్ల తండా, ఇందల్వాయి మండలం
నస్రుల్లాబాద్, జూలై 2: గత ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకుండా తిరస్కరించాయి. కొన్నేండ్లుగా భూమిని సాగు చేస్తున్న. సీఎం కేసీఆర్ మా బాధలు, ఇబ్బందులను అర్థం చేసుకొని పట్టాలను అందించారు. చాలా సంతోషంగా ఉంది.
-పాల్త్య ధూప్ సింగ్ ,రైతు, సంగెం, నస్రుల్లాబాద్ మండలం
ఎన్నో ఏండ్లుగా ఎదరుచూస్తున్న కల నెరవేరింది. పట్టాలు వస్తాయని మేము అనుకోలేదు. మా బతుకుదెరువు కోసం రెండు ఎకరాల పోడు భూముల్లో సాగుచేసుకుంటున్నం. ఇప్పుడు సీఎం కేసీఆర్ మాకు పట్టాలను ఇచ్చి భూ యజమానులను చేశాడు.సీఎం కేసీఆర్కు గిరిజనులందరం రుణపడి ఉంటాం.
-జురుపుల సక్రు, సంగెం తండా, నస్రుల్లాబాద్ మండలం
ఏండ్ల తరబడి సాగు చేస్తున్న మాకు పట్టాలు లేక అనేక ఇబ్బందులు పడ్డాం. భూములు దున్నుతున్న సమయంలో అటవీశాఖ అధికారులు అడ్డుకునే వారు. చేసేదేమి లేక పట్నంకు వలస పోయాం. సీఎం కేసీఆర్ సారు మా భూమికి పట్టా ఇచ్చి భద్రత కల్పించిండు. ఇక నుంచి ఇక్కడే భూమిని సాగు చేసుకోని బతుకుతం.
– గణేశ్, కొయ్యగుట్ట తండా, బాన్సువాడ మండలం
గిరిజనుల గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక గిరిజనుల గురించి ఎంతో ఆలోచించారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేశారు. రిజర్వేషన్లు పెంచారు. ప్రస్తుతం పట్టాలు ఇస్తున్నారు. గిరిజనులు ఎంతో సంతోషంగా ఉన్నాం.
-బానోత్ బుజ్జి, అంకిరెడ్డిపల్లి
ఇక మాకు పట్టా ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతు బీమా ఇస్తారట. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్లేగా పంటలను సాగు చేస్తున్నాం. కానీ మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం స్పందించి పట్టాలు ఇచ్చింది.
-బానోత్ లక్ష్మి,ఎల్లంపేట.
బాన్సువాడ రూరల్, జూలై 2 : ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమికి పోడు పట్టాలు ఇచ్చి మా బతుకులకు భరోసా కల్పించిండు కేసీఆర్సార్.గతంలో ఉన్న ఏ సీఎం కూడా మా భూముల గురించి ఆలోచించలేదు. సీఎం సారు ఇచ్చిన మాటకు కట్టుబడి పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకున్నడు. ఆయన నిండు నూరేండ్లు సల్లంగా ఉండాలి.
-మూడ్ విజయ, రైతు రాంపూర్ తండా, బాన్సువాడ మండలం
పోడు పట్టాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. గిరిజనులకు పట్టాలు ఇవ్వడం గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక. దేశంలో ఎక్కడా లేనివిధంగా గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తున ఏకైక ప్రభుత్వం ఇది. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్కు గిరిజనులు జీవితాంతం రుణపడి ఉంటారు.
-బానోత్ నరేందర్, బోర్లం క్యాంపుతండా, బాన్సువాడ మండలం
సిరికొండ, జూలై 2: రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలో 881మంది గిరిజనులకు పోడు పట్టాలను ఆదివా రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. గిరిజనులు చాలా ఏండ్ల నుంచి పోడు భూములకు హక్కు కల్పించాలని కోరగా సీఎం కేసీఆర్ పట్టాలు అందించారని అన్నారు. గిరిజనుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. గిరిజనుల అటవీభూమి హక్కుల కోసం కేంద్రంతో పోరాడి పోడు పట్టాలని సాధిం చి పెట్టారని అన్నారు. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ సంగీతా రాజేందర్,జడ్పీటీసీ మలావత్ మాన్ సింగ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఆకుల తిరుమల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఎన్నం రాజిరెడ్డి, విండో చైర్మన్లు గంగారెడ్డి, రాములు, వివిధ సర్పంచులు పాల్గొన్నారు.
వర్ని, జూలై 2: సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టా ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆర్థిక ఇబ్బందులో కిరాణా దుకాణం నడుపుతూ, వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాను. గ్రామ శివారులో 30 ఏండ్లుగా మా కుటుంబం పోడు భూములను సాగు చేసుకుంటున్నది. ఇప్పుడు ఆ భూములకు పట్టాలు ఇవ్వడం సంతోషకరంగా ఉన్నది.
– కెతావత్ రేణుకాబాయి, రైతు,
పొట్టిగుట్ట తండా, వర్ని
నేను బీజేపీ కార్యకర్తనైనా.. నాపై కరుణ చూపించారు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు నినాదాలు చేశాను. గ్రామ శివారులో నేను కొంత భూమిని సాగు చేసుకుంటున్నాను. నా బాధను అర్థం చేసుకొని పట్టా అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి, స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాను.
– కేతావత్ రాంజీ, దివ్యాంగుడు,
పొట్టిగుట్టతండా, వర్ని